VRS వివాదం : బాబువి కుటిల రాజకీయాలు – గోరంట్ల
నామినేషన్కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. పార్టీల్లో టెన్షన్ మొదలయ్యాయి. ముఖ్యంగా హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నామినేషన్ విషయం ఉత్కంఠ రేపుతోంది. ఆయన వీఆర్ఎస్ విషయం వివాదం రేపుతోంది. దీనిపై మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబు కుటిల రాజకీయాల వల్లనే తన VRSకి ఇబ్బందులు తలెత్తాయని గోరంట్ల మాధవ్ తెలిపారు. మార్చి 24వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
2018 డిసెంబర్ 28వ తేదీన వీఆర్ఎస్కి అప్లై చేసినట్లు..అయితే..దీనిని ఆమోదించకుండా మూడు నెలలు గడుస్తున్నా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. బాబు ఆదేశాల మేరకు కర్నూలు డీఐజీ తప్పించుకుంటున్నారని వెల్లడించారు. తనను రిలీవ్ చేయాలని ట్రిబ్యునల్, డీజీ ఆదేశాలు జారీ చేసినా..బాబు రాజకీయ వత్తిళ్లతో డీఐజీ తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. కోర్టుకు వెళితే..వెంటనే రిలీవ్ చేయాలని ఆర్డర్ వేసినా..పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
VRSకు సర్కార్ ఆమోదించకపోవడం..రిలీవ్ చేయకపోవడంతో మాధవ్ నామినేషన్ వేస్తారా ? లేదా ? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మార్చి 25వ తేదీ సోమవారం లాస్ట్ డే ఉండడంతో వైసీపీ ప్రత్నామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. మాధవ్ భార్యను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తోంది. కోర్టును ఆశ్రయిస్తే ఎలా ఉంటుందనే దానిపై నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. మార్చి 23 శనివారం, మార్చి 24వ తేదీ ఆదివారం సెలవు దినాలు. మార్చి 25వ తేదీ సోమవారం అత్యవసర పిటిషన్ వేసినా విచారణ జరిగి..తీర్పు రావడం ఆలస్యమయితే ఎలా అనే దానిపై ఆలోచిస్తున్నారు వైసీపీ నేతలు.
ఎంపి జెసికి వ్యతిరేకంగా మీసం మెలేసీ..హెచ్చరించిన గోరంట్ల మాధవ్ అందరి దృష్టిని ఆకర్షించారు. సిబ్బందిపై ఎంపి జేసి చేసిన వ్యాఖ్యల పై గోరంట్ల తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.