రాళ్ల దాడులు : జమ్మలమడుగులో టీడీపీ – వైసీపీ ఫైటింగ్

  • Published By: madhu ,Published On : March 19, 2019 / 10:59 AM IST
రాళ్ల దాడులు : జమ్మలమడుగులో టీడీపీ – వైసీపీ ఫైటింగ్

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. భౌతికదాడులకు దిగుతున్నారు. మొన్న కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి జరిగిన ఘటన మరిచిపోకముందే మరో నేతపై ఎటాక్ జరిగింది. 2019, మార్చి 19వ తేదీ జమ్మలమడుగు వైసీపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కారుపై టీడీపీ లీడర్స్ దాడి చేశారు. రాళ్లు విసిరారు. కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కారులోని మహేశ్వర్ రెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఎదురుదాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

రెండు వర్గాలను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు పార్టీ ఇన్ ఛార్జీ సుధీర్ రెడ్డిలు ఘటనాస్థలికి చేరుకున్నారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెల్లాల లక్ష్మయ్య అనే వ్యక్తి టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారు. దీంతో మహేశ్వర్ రెడ్డి ఆయన్ను కడప ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గరకు తీసుకుని వెళుతుండగా ఈ ఘటన జరిగింది.