పొత్తుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్న జనసేన
ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు పొత్తులు, అనుసరించాల్సిన ఎత్తులుపై తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటున్న కమ్యునిష్ట్ పార్టీలు, జనసేన ఇవాళ(12 మార్చి 2019) సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. గతవారం ఇరువర్గాలు సమావేశమై దీనిపై చర్చించగా.. తమకు 26 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు కావాలని కమ్యునిష్ట్లు కోరారు. అయితే సీపీఎం, సీపీఐ చేసిన ప్రతిపాదనలపై పరిశీలిస్తామని చెప్పిన జనసేన నేతలు మంగళవారం క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.
ఇప్పటికే అభ్యర్ధుల నుండి అప్లికేషన్లు స్వీకరించిన జనసేన తొలి లిస్ట్ను ప్రిపేర్ చేసి ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో ఇవాళ జరగనున్న చర్చకు ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణలు పాల్గొంటారు. పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే కర్నూలు, విశాఖపట్నం సీట్లను సీపీఎం కోరుతుండగా.. విజయవాడ, అనంతపురం పార్లమెంటు సీట్లను తమకు ఇవ్వాలంటూ సీపీఐ కోరుతుంది.