ఎన్నికల ప్రచారంపై జనసేనాని సమీక్షలు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలని చూస్తున్న జనసేనాని..అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలను చుట్టేసిన పవన్ కళ్యాణ్..తాజాగా పార్టీ నాయకులు..అభిమానులతో చర్చిస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారం విజయవాడ నుంచి ప్రారంభిస్తానని ప్రకటించిన పవన్… ప్రస్తుతం రోజుకు రెండు జిల్లాలకు సంబంధించి సమీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి 2019, జనవరి 2వ తేదీ నుండే ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నా 2019, జనవరి 3వ తేదీకి వాయిదా పడ్డాయి. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల సమీక్షకు అజెండా సిద్ధమైంది. వీలైతే రానున్న రోజుల్లో రోజుకు మూడు జిల్లాల పార్టీ సమీక్షలు పూర్తిచేసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. వారంలోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. జనసేన మేనిఫెస్టో ఎంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్లారు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఎలా ఉంది, జనసేన అభిమానులకు, పార్టీ నాయకులకు మధ్య సమన్వయం ఎలా ఉందన్న అంశాలపై ఆయన సమీక్షించనున్నారు.