నో లీక్ : కాళేశ్వరం పనుల్లో గజ ఈతగాళ్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సాగు, తాగు నీరందించాలనే సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గోదావరి నదిపై బ్యారేజీలతో పాటు టన్నెల్ నిర్మాణం వేగవంతమైంది. అండర్గ్రౌండ్ టన్నెల్లోని సర్జ్పూల్లో ట్రయల్ రన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి లీకేజీలు లేకుండా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అనుకున్న లక్ష్యానికి నీరందించాలని సీఎం ఆదేశాలతో అధికారులు పనుల్లో వేగం పెంచారు.
6వ ప్యాకేజీలో ఇంజనీరింగ్ అధికారులు వెట్ రన్ పనులు మొదలు పెట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు జీరోపాయింట్ నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా రెండు సొరంగ మార్గాలకు ఈ నెల17న అధికారులు నీటిని విడుదల చేశారు. తొలిసారి ప్రాజెక్టులోకి గోదావరి జలాలు రావడంతో పూజలు నిర్వహించి హారతి పట్టారు అధికారులు. 6వ ప్యాకేజీలో 0.2 టీఎంసీల నీటిని విడుదల చేసిన అధికారులు నీటి తరలింపుల ప్రక్రియలో లోపాలను గుర్తించే పనిలో పడ్డారు.
మొదటి దశలో 10శాతం…ఆ తరువాత 25 శాతం… మూడో దశలో 50శాతం వరకు నీటిని విడుదల చేయడంతో సర్జ్ పూల్లో 124.50 మీటర్ల వరకు నీటి మట్టం చేరుకుంది. ఆ తరువాత నీటి తరలింపును నిలిపి వేశారు. లీకేజీలను గుర్తించేందుకు విశాఖపట్నం, ఒడిశాల నుంచి 10 మంది గజ ఈత గాళ్ళను రంగంలోకి దింపారు. గంటల తరబడి గజ ఈతగాళ్లు నీటిలో ఈదుకుంటు లోపాలున్నయా ? అనేది చూశారు. చివరకు లోపాలు ఏమీలేవని వారు నిర్ధారించడంతో సర్జ్ పూల్ నుంచి మోటార్ల ద్వార నీటిని పంపింగ్ చేసెందుకు సిద్దమవుతున్నారు అధికారులు.
సొరంగాలు, సర్జ్ పూల్లో లోపాలు లేవని నిర్ధారించుకున్న ఇంజనీరింగ్ అధికారులు సర్జ్ పూల్ను వంద శాతం అంటే 142 మీటర్ల వరకు నింపడానికి ప్రయత్నిస్తున్నారు. సర్జ్ పూల్ను నింపడం ద్వారా నీటి మట్టం పెరుగుతుందని, దీని ద్వారా లీకెజీలు ఏమైన ఉంటే బయటపడే అశకాశముందనే కారణంతో మరోసారి ఎల్లంపల్లి జలాలను 6వ ప్యాకెజిలోకి విడుదల చేశారు. 6వ ప్యాకెజికి సంబందించి ఈ నెల 24 న మరోసారి వెట్ రన్ నిర్వహించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ హాజరై…వెట్ రన్ను స్వయంగా పరిశీలించే అవకాశముందని యుద్దప్రాతిపాదికన అధికారులు, కాంట్రక్టు సంస్థల ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు..