కారులో మద్యం సీసాలతో అడ్డంగా దొరికిన సీఐ త్రినాథ్ రావు సస్పెండ్
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో మద్యం షాపులు బంద్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో షాపులన్నీ మూతపడ్డాయి. ఎక్కడైనా మద్యం అమ్మకాలు జరిగితే పట్టుకోవాల్సిన సీఐ తన కారులో మద్యం సీసాలతో తరలిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ సీఐ త్రినాథ్ చేసిన పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ పై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా, రూ.5 లక్షల జరిమానా విధించినట్లు డీప్యూటి సీఎం నారాయణ స్వామి తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్సైజ్ సీఐ త్రినాథ్పై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం నారాయణ తెలిపారు.
వివరాల్లోకి వెళ్లే.. తూర్పుగోదావరి జిల్లా కుతుకులూరు మారుతీనగర్లోని ప్రభుత్వ మద్యం దుకాణానికి సీల్ వేయాలంటూ రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ ఆదివారం(మార్చి 29,2020) న అక్కడికి వచ్చారు. సీఐ వాహనంతో పాటు, ఇంకా రిజిస్ట్రేషన్ కానీ వాహనంలో మరికొందరు వచ్చారు. మద్యం షాపు సూపర్ వైజర్లు తమకు సమస్య వస్తుందన్ని చెప్పినా వినిపించుకోకుండా రూ.1.5 లక్షల మద్యం బాటిళ్లను సీఐ వాహనాల్లో ఎక్కించారు. మద్యం సీసాలను తీసుకెళ్తుండగా కుతుకులూరు సమీపంలో గ్రామస్థులు వారిని అడ్డుకుని అనపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి ఘటన స్థలానికి చేరుకుని మద్యం అక్రమాలకు పాల్పడిన సీఐ త్రానాథ్ ను నిలదీశారు. అంతేకాకుండా లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి మద్యం బాటిళ్లు అక్రమంగా తరలిస్తున్నందుకు ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సీఐ త్రినాథ్ పై సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ సూపరింటిండెంట్ ప్రభుకుమార్ ఆదేశాలు జారీ చేశారు.