ఏడాది పగ : బైక్ మీద వెళ్తూనే బావమరిది గొంతు కోసేశాడు

  • Published By: veegamteam ,Published On : November 15, 2019 / 09:03 AM IST
ఏడాది పగ : బైక్ మీద వెళ్తూనే బావమరిది గొంతు కోసేశాడు

అక్కను చూడటానికి వచ్చిన బావమరిదిని గొంతు కోసం చంపేశాడు ఓ  బావ. సంవత్సరం క్రితం ఇద్దరి మధ్యా ఉన్న గొడవను మనసులో పెట్టుకొని కిరాతకంగా బావమరిదిని అంతమొందించాడు. ఈ దారుణం ఆదిలాబాద్‌ లో చోటుచేసుకుంది. 

వివరాలు..ఆదిలాబాద్ లోని సుందరయ్యనగర్ ప్రాంతంలో మమత, సంతోష్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ కలహాలతో వీరిద్దరి మధ్య సంవత్సరం కిత్రం గొడవ జరిగింది. అక్క కాపురంలో వచ్చిన కలహాల విషయంలో మహారాష్ట్రలో ఉండే మమత సోదరుడు మనోజ్ కలగజేసుకున్నాడు. 

బావకు నచ్చజెప్పే క్రమంలో పలుమార్లు కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు మనోజ్. ఐనా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మమత మహారాష్ట్రలో ఉండే తన పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత అక్కతో కలిసి బావ సంతోష్ పై పోలీస్ కేసు పెట్టాడు. తరువాత పోలీసుల కౌన్సెలింగ్ తో మమతా..సంతోష్ మధ్యా గొడవలు సర్దమణిగి కలిసి ఉంటున్నారు. ఇద్దరూ కలిసి ఆదిలాబాద్ వచ్చేసి కలిసే ఉంటున్నారు. 

ఈ క్రమంలో అక్క కాపురం ఎలా ఉందోననీ..అక్క సంతోషంగా ఉందో లేదోనని తెలుసుకునేందుకు మనోజ్ ఆదిలాబాద్ వచ్చాడు. కానీ బావమరిదిపై బావ సంతోష్ కోపం పోలేదు. దీంతో బావమరిదిని బైటకెళ్లి  టీ తాగుదాం అంటూ బైటకు తీసుకెళ్లాడు. బావమరిదిని బైక్ నడపమన్నాడు. వెనుకాలే సంతోష్ కూర్చున్నాడు. అలా బైటకు వెళ్లాక..వెనుక కూర్చుకున్న సంతోష్ కూడా తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి చంపేశాడు. అనంతరం పరారయ్యాడు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సంతోష్ కోసం గాలిస్తున్నారు. తాను సంతోషంగా ఉన్నానో లేదో చూసేందుకు వచ్చిన తన తమ్ముడు భర్త చేతిలో హత్యకు గురికావటంతో మమత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.