రాష్ట్రం బాగుంది.. చంద్రబాబు గారు మీ పాదం మోపొద్దు – రోజా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయనుందని, మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్న చంద్రబాబును రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే నారా లోకేశ్ను మంగళగిరిలో ఓడించారని చెప్పుకొచ్చారు.
ప్రజల చైతన్యానికి వచ్చిన ప్రమాదమేమే లేదని, రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అమ్మఒడి, రైతు భరోసా, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, దిశ వంటి వాటితో పాటు వర్షాలు వచ్చి రైతులంతా సుఖంగా ఉన్నారని ఆమె చెప్పారు. ఎంతసేపు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు కానీ.. ఆయన చేసిన పాపాలను ఆ దేవుడు కూడా క్షమించడు అని విమర్శించారు.
చంద్రబాబు పాదం మోపితే పచ్చని చెట్లు కూడా ఎండిపోతాయని, ఆయన పాదం మోపలేదు కాబట్టే ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా గెలిచారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఇప్పుడు బాగుందని, ఈ సమయంలో చంద్రబాబు తన పాదం మోపి రాష్ట్రాన్ని నాశనం చేయొద్దంటూ తీవ్ర విమర్శలు చేశారు.