సిద్ధంగా ఉండండి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు
‘ఫణి’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే విపత్తును ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. శ్రీహరికోటకు అగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుఫాన్ కేంద్రీకృతమైంది. తీరంవైపు 45 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
మరో 24 గంటల్లో పెనుతుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 30వ తేదీ నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా తుఫాన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.