ఇసుక మాఫియా : వీఆర్వోల తలలు పగులగొట్టారు

  • Published By: madhu ,Published On : May 15, 2019 / 06:52 AM IST
ఇసుక మాఫియా : వీఆర్వోల తలలు పగులగొట్టారు

ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతూనే ఉంది. అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే..ఊరుకోమని..కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న మాటలు ఉట్టివేనని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇటీవలే ఓ కానిస్టేబుల్‌పై రెచ్చిపోయిన ఇసుక మాఫియా..తాజాగా అధికారులపై దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. లారీల్లో తరలిస్తున్న ఇసుకను రెవెన్యూ యంత్రాంగం అడ్డుకొనేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చేసుకుంది. 

నైరా గ్రామం..వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక రెవెన్యూ అధికారాలు.. VROలను పరిశీలనకు పంపించారు. మే 15వ తేదీ బుధవారం ఉదయం అక్రమ రవాణా జరుగుతున్న సమయంలో ఆ లారీలను వీఆర్వోలు అడ్డుకున్నారు.

దీంతో అక్కడున్న గ్రామస్థులు వీరిపై దాడికి దిగారు. అధికారుల తలలు పగిలాయి. దాడిలో వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరరావుకు గాయాలయ్యాయి. వీరిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కలెక్టర్‌కు వీఆర్వోలు సమాచారం ఇవ్వడంతో విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.