శాతవాహన వర్శిటీ విద్యార్ధులపై మావోల వల: రిక్రూట్ చేసుకునే యత్నాలు
ఒకప్పుడు విప్లవకారులను అందించింది శాతవాహన యూనివర్శిటీ. ఈ క్రమంలో విశ్వవిద్యాలయాలలోనే రిక్రూట్ మెంట్ విషయంలో సైద్ధాంతిక నిర్మాణం జరగాలని మావోయిస్టు పార్టీ భావిస్తోందా? దీని కోసం ఉన్నత విద్యనభ్యసించినవారే కావాలని మావో పార్టీ గుర్తించినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా మరోసారి మావోయిస్ట్ల రిక్రూట్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
తాజాగా శాతవాహన యూనివర్సిటీని కేంద్రంగా చేసుకున్న మావోలు రిక్రూట్ మెంట్ జరుగుతున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. మావోయిస్టు పార్టీలో చేరడానికి వర్శిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మావోల పార్టీలో చేరేందుకు ప్రోత్సాహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా కరీంనగర్ జిల్లా… విప్లవాల పురిట గడ్డ అనే విషయం తెలిసిందే. జగిత్యాల జైత్రయాత్ర నుంచి జంగల్ మహల్ వరకు ఉద్యమంలో పాల్గొన్న మావోయిస్టుల్లో చాలా మంది ఈ జిల్లాకు చెందిన వారే.
ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావిత ప్రదేశంగా ఉన్న కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం వారి కార్యకలాపాలు గత కొంత కాలంగా తగ్గిపోయాయి. ఒకప్పుడు యూనివర్సిటీలో చదువుకున్న ఉన్నత విద్యావంతులంతా నక్సలైట్ల సిద్ధాంతానికి ఆకర్షితులై అడవి బాట పట్టారు. ఈ క్రమంలో పోలీస్ నిఘా పెరగడంతో వర్సిటీలో ఆ ప్రభావం క్రమేపీ తగ్గిపోయింది. ఒకప్పుడు యూనివర్సిటీలో చదువుకునే వారిని ఉద్యమం వైపు మళ్లించిన నక్సల్స్ పార్టీ.. ఇప్పుడు అదే తరహా పద్ధతిని యోచిస్తున్నట్లుగా నిఘావర్గాలకు సమాచారం అందింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఎంత క్రీయాశీలక పాత్ర పోషించిందో తెలిసిన విషయమే. టీవీవీ పేరిట ఈ సంస్థ మేధావి వర్గాన్ని ఒకే వేదిక పైకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. కాగా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీవీవీ కార్యకలాపాలు నిలిచి పోయాయి. స్వంత రాష్ట్రం కోసం ఏర్పడిన టీవీవీ పేరును ఇప్పుడు మావోలు వాడుకుంటూ తెలంగాణ విద్యార్థి వేదికను ఏర్పాటు చేశారన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో చదువుతూ టీవీవీలో నాయకులుగా పని చేస్తున్న సూర్యుడు, మహేష్, రాజులతో పాటు..మరికొంతమందికి మావోలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్ వెళ్లి సంస్థను బలోపేతం చేస్తామంటూ మావోయిస్టు నేత చంద్రన్నను కలిసి నిధులు తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తమకు మావోయిస్టులకు ఎలాంటి సంబంధం లేదని టివివి నాయకుడు మహేష్ చెబుతున్నారు. ఆరోపణలు చేయడం కాదు రుజువులు ఉంటే చూపించండి అని సవాల్ విసురుతున్నారు.
ఇటు యూనివర్సిటీకి సంబంధించిన ఓ మహిళా ప్రొఫెసర్ విద్యార్థులను స్టడీ టూర్ పేరుతో ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతాలకు తీసుకువెళ్లి మావోయిస్టులతో భేటీ అయ్యేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సదరు ప్రొఫెసర్ విద్యార్ధులతో కలిసి దిగిన ఫోటోలు చూపెడుతూ మావోయిస్టులను కలిసేందుకు వెళ్లారంటూ విద్యార్ధి సంఘాలు అంటున్నాయి. దీంతో మావోలతో సంబంధాలు ఉన్నవారిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలంటా ఆందోళనకు కూడా చేపట్టారు. కాగా శాతవాహన వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న శాతవాహన యూనివర్సిటిలో మావోల కలకలం యూనివర్సిటీలోని మిగితా విద్యార్థులను మాత్రం ఆందోళన గురి చేస్తుంది.