పోలీసులకు ‘సైరా’షాక్ : సినిమాకు వెళ్లారని ఎస్సైలపై చర్యలు
కర్నూలు పోలీసులకు సైరా సినిమా షాక్ ఇచ్చింది. సైరా సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలపై ఉన్నతాధికారులు మండిపడ్డారు. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా అక్టోబర్ 2న విడుదల అయ్యింది. అర్థరాత్రి నుంచే ఈ సినిమా షోలు ప్రారంభమయ్యాయి. దీంతో సైరా సినిమా థియేటర్ లో చూద్దామని కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్లలోని థియేటలర్ లో ఆరుగురు ఎస్సైలు వెళ్లి సినిమా చూశారు.
ఈ విషయం తెలిసిన జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. విధుల్లోఉండి..ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సినిమాకు వెళ్లటమేంటంటూ మండిపడ్డారు. వెంటనే ఆ ఆరుగురు ఎస్సైలను వీఆర్ కు పంపించారు. అవుకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి,కోయిల కుంట్ల ఎస్సై జగదీశ్వర్ రెడ్డి, నందివర్థన్ ఎస్సై హరిప్రసాద్, బండి ఆత్మకూరు ఎస్సై వెంకటసుబ్బయ్య, రాచర్ల ఎస్సై ప్రియతమ రెడ్డి, మరో ఎస్సై అశోక్ లను వీఆర్ కు వెళ్లాలని ఎస్పీ ఫకీరప్ప ఆదేశించారు.