మూడు జాముల గ్రామం : కనిపించని సాయంత్రం
ఉదయం ఆరు దాటితే వెలుతురు రావడం…మధ్యాహ్నం దాటిన తరువాత సాయంత్రం రావడం…6 గంటలు దాటితే చీకటి పడడం కామన్. అయితే..ఓ గ్రామంలో అలా జరగదు. సాయంత్రం 4గంటలు దాటిందంటే చాలు..గ్రామాల్లోని ఇళ్లల్లో లైట్లు, దీపాలు వెలుగుతుంటాయి. ఎందుకంటే అప్పటికే చీకటి పడుతుంది కనుక. అక్కడ సాయంత్రం ఉండదన్నమాట.
ఉదయం సూర్యుడు కూడా ఆలస్యంగానే దర్శనమిస్తాడు. అందుకే ఈ విలేజ్కి మూడు జాముల ప్రాంతంగా పేరొచ్చింది. మరి ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే చదవండి…
సాధారణంగా రోజుకు ఎన్ని జాములుంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కదా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని కొదురుపాక గ్రామంలో మాత్రం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి…ఈ మూడు జాములు మాత్రమే ఉంటాయి. సాయంత్రం జాము అస్సలు ఉండదు. ఎందుకంటే నాలుగు గంటలకే అక్కడ సూర్యుడు అస్తమిస్తాడు. దీనికి కారణం గ్రామం చుట్టూ నాలుగు పెద్ద పెద్ద కొండలున్నాయి.
తూర్పున గొల్లగుట్ట, పడమరాన రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్టలు ఉన్నాయి. తూర్పున ఉన్న గొల్లగుట్ట… గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. అంటే మిగతా ప్రాంతాల కంటే సూర్యకిరణాలు కొదురుపాకపై గంట ఆలస్యంగా పడతాయన్నమాట. ఇక.. 4 గంటల ప్రాంతంలో సూర్యుడు… గ్రామ పడమర దిక్కున ఉన్న రంగనాయకుల గుట్ట వెనక్కి వెళ్తాడు. దీంతో ఈ గ్రామాన్ని చీకటి అలుముకుంటుంది. అంటే మూడో జాము సాయంత్రం సమయంలోనే చీకటిపడటంతో.. ప్రతి ఇంట్లో విద్యుత్తు దీపాలు, కిరోసిన్ దీపాలు వెలుగుతాయి. అందుకే ఈ గ్రామాన్ని మూడుజాముల కొదురుపాక అని పిలుస్తారు.