సికింద్రాబాద్‌లో విషాదం, ఆఫీస్ బిల్డింగ్‌పై నుంచి దూకి టెక్ మహీంద్రా ఉద్యోగిని ఆత్మహత్య

సికింద్రాబాద్‌లో విషాదం, ఆఫీస్ బిల్డింగ్‌పై నుంచి దూకి టెక్ మహీంద్రా ఉద్యోగిని ఆత్మహత్య

tech mahindra employee suicide: సికింద్రాబాద్‌లో విషాదం నెలకొంది. టెక్‌ మహీంద్రా కాల్‌ సెంటర్‌ ఉద్యోగిని సుస్మిత ఆత్మహత్య చేసుకుంది. కాగా ఆమె మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. సుస్మిత ఆరో అంతస్తు నుంచి దూకిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలిలోనే ఆమె చనిపోయింది. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు పోలీసులు.

నామాలగుండులో ఉప్పరబస్తీకి చెందిన 18ఏళ్ల సుస్మిత.. కాల్‌ సెంటర్‌లో నెల క్రితమే ట్రైనింగ్‌ పూర్తి చేసుకుంది. తమ కూతురుకు ఎలాంటి ఇబ్బందులు లేవని తల్లిదండ్రులు గోవిందరాజు, శీల చెబుతున్నారు. తాము రాకముందే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు గోపాలపురం పోలీసులు.



సికింద్రాబాద్‌ గోపాలపురం పరిధిలో టెక్ మహీంద్రా కార్యాలయం ఉంది. ఇవాళ(నవంబర్ 19,2020) ఉదయం ఆఫీసుకి వచ్చిన సుష్మిత.. కొద్దిసేపటికి భవనంపై నుంచి దూకేసింది. తలకు తీవ్రగాయాలు కావడంతో స్పాట్ లోనే చనిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆఫీసులో పనిచేసే సహోద్యోగుల, మేనేజర్‌ను విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే సుష్మిత ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సుష్మిత ఆత్మహత్యకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరారు.