TRS ప్రచార భేరి : మహబూబ్ నగర్, వనపర్తికి KCR

  • Published By: madhu ,Published On : March 31, 2019 / 01:26 AM IST
TRS ప్రచార భేరి : మహబూబ్ నగర్, వనపర్తికి KCR

TRS అధినేత, తెలంగాణ సీఎం పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి పి. రాములు తరపున ప్రచారం చేయనున్నారు. మహబూబ్‌నగర్‌ సమీపంలోని భూత్పూర్‌ మండంలం అమిస్తాపూర్‌, వనపర్తి సమీపంలోని నాగవరం దగ్గర నిర్వహిస్తున్న బహిరంగ సభలకు కేసీఆర్‌ హాజరవుతారు. 

మొదట కేసీఆర్‌ హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు వనపర్తి సమీపంలోని నాగవరం దగ్గర జరిగే సభకు హాజరవుతారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను  వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అభ్యర్థి పి. రాములుతో కలిసి పరిశీలించారు. రెండున్నర లక్షల మందిని సభకు తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

నాగర్‌కర్నూల్‌లో సభ ముగించుకుని కేసీఆర్‌ అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30కు సభలో ప్రసంగించనున్నారు. భూత్పూర్‌ దగ్గర 100 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు చేశారు. 2015లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన సందర్భంగా ఇక్కడే సభ నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ప్రచార సభనూ ఇక్కడే నిర్వహిస్తున్నారు. సభాస్థలి దగ్గర ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించారు. సభకు భారీ జన సమీకరణపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు దృష్టి సారించాయి.