అమెరికాలో తెలంగాణ యువతి మృతి
అమెరికాలో తెలంగాణకు చెందిన వ్యక్తి చనిపోయింది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి అనుమానస్పద మృతిచెందింది. తొర్రూరు మండలంలోని చింతలపల్లిలో నివాసం ఉంటున్న సెగ్గెం మహేందర్, విమలమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరి చిన్న కుమార్తె సంధ్యను తొర్రూరుకు చెందిన సమీప బంధువు దూంపల్లి శ్రీకాంత్తో 8నెలల క్రితం వివాహం చేశారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని టెక్సాస్లో ఉంటున్నాడు. భార్యను కూడా అక్కడికి తీసుకెళ్లాడు. వివాహం అయిన ఆరు నెలల వరకు శ్రీకాంత్, సంధ్యల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే ఈ మధ్య అదనపు కట్నం కోసం శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు సంధ్యను వేధింపులకు గురిచేసినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో అనూహ్యంగా సంధ్య గొంతుకోసుకొని ఆత్మహత్య చెసుకుంది. ఈ విషయాన్ని భారత్లోని ఆమె బంధువులకు శ్రీకాంత్ తెలియజేశాడు. ఈ విషయం తెలుసుకున్న సంధ్య తండ్రి మహేందర్ వెంటనే తొర్రూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.