మూఢ నమ్మకాలతో కవల పిల్లలకు వాతలు పెట్టించిన తల్లి
అత్యాధునిక యుగంలో ఉన్నాం. శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నాం. కానీ ప్రజల్లో మూఢాచారాలు అలాగే వేళ్లూనుకున్నాయి. ఇప్పటికీ చాలా మంది మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. అనారోగ్యానికి గురైతే డాక్టరు దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోకుండా మూఢ నమ్మకాలు, మంత్రాలు, తాయత్తులపై ఆధారపడిన వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. మూఢనమ్మకం ఓ కుటుంబంలో విషాదం మిగిల్చింది.
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఊబిగుంటకు చెందిన కోట రాములమ్మ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడ శిశువులు అనారోగ్యానికి గురి కావడంతో నాటు వైద్యాన్ని నమ్ముకుని పొట్టపై సూది వాతలు పెట్టించింది. ఆ తర్వాత అనారోగ్యంతో రాములమ్మ మృతి చెందడంతో కవల శిశువులను సాలూరు ఆస్పత్రికి తరలించి సంరక్షిస్తున్నారు. రాములమ్మ కుటుంబంలో ఎవరో ఒకరు కవలల సంరక్షణ బాధ్యత తీసుకునే వరకు ఆస్పత్రిలోనే ఉండే ఏర్పాటు చేశారు.