సవాళ్లు.. ప్రతి సవాళ్లు: అది చంద్రబాబు తెరిచిన పుస్తకం.. సుజనపై విజయసాయి సెటైర్లు

  • Published By: vamsi ,Published On : December 25, 2019 / 12:43 AM IST
సవాళ్లు.. ప్రతి సవాళ్లు: అది చంద్రబాబు తెరిచిన పుస్తకం.. సుజనపై విజయసాయి సెటైర్లు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, అక్రమ కంపెనీలు, మనీ ల్యాండరింగ్, వ్యాపార స్కామ్‌లపై విచారణ చేసే అంశాన్ని కేంద్ర హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రాష్ట్రపతి పంపారు. రాష్ట్రపతి స్పందించడంతో కేంద్రం ఎలా వ్యవహరిస్తుందనేది ఉత్కంఠగా మారిన క్రమంలో దీనిపై సుజనా చౌదరి వివరణ ఇచ్చారు.

ఈ క్రమంలోనే రాష్ట్రపతి స్పందించడంపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఓ ప్రతికా ప్రకటన విడుదల చేశారు.

1. సుజనా చౌదరి(వైఎస్‌ చౌదరి) మీద నేను చేసిన ఆరోపణలకు పూర్తిగా కట్టుబడి వున్నాను. వైఎస్‌ చౌదరి గత రెండు మూడు దశాబ్దాలుగా నకిలీ కంపెనీలను సృష్టించి ఎలా మోసం చేశారో… భారత బ్యాంకింగ్‌ వ్యవస్థను రూ. 8 వేల కోట్ల మేరకు ఎలా ముంచేశారో, సింగపూర్‌ లో చేసిన మోసాలు ఏమిటో… మారిషస్‌ లో చేసిన కుంభకోణం ఏమిటో… దుబాయ్, అమెరికాల్లో ఆయన ఆర్థికంగా చేసిన తప్పుడు పనులు ఏమిటో… సేల్స్‌ ట్యాక్స్, కస్టమ్స్, కేంద్ర ఎక్సైజ్, ఐటీæ శాఖలను ఎలా నిలువునా ముంచాడో వివరంగా నేను రాష్ట్రపతికి లేఖ రాస్తే, ఆ ఆరోపణలు తప్పని సుజనాచౌదరి భావిస్తే… ఎలాంటి విచారణకు అయినా తాను సిద్దం అని ప్రకటించి ఉండేవారు. కానీ అటువంటి ప్రకటనలు చేయకుండా తన మీద ఏ విధమైన ఫిర్యాదులు… ఏ సంస్థకానీ, ఏ వ్యక్తికానీ చేయలేదు అంటూ మరో పచ్చి అబద్దం చెప్పారు.

2. సుజనాచౌదరి మీద ఇప్పటి ఆయన మిత్రుడు, ఒకప్పుడు ఆయనను కిందకు లాగాలని అనుకున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే మూడు రోజుల పాటు ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో సుజనా వారి మాయా సామ్రాజ్యం అంటూ పతాక శీర్షికల్లో వార్తా కథనాలు ప్రచరించారు.

3. సుజనాచౌదరి వంటి ఆర్థిక నేరస్తుల మీద భారతదేశంలోని ఈడీ, సీబీఐ పనిచేయకపోతే అసలు ఆ సంస్థల మనుగడకే అది ముప్పు.

3. మరొక అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. తన జీవితం తెరిచిన పుస్తకం అని సుజనా చౌదరి అంటున్నాడు. అది ఎవరు తెరిచిన పుస్తకం అన్నదే ముఖ్యం. అది చంద్రబాబు తెరిచిన పుస్తకం. చంద్రబాబు కోసం తెరిచిన పుస్తకం.

4. మరో ముఖ్యమైన విషయం కూడా చెబుతున్నాను. కేంద్రప్రభుత్వం ఈ అంశం మీద దర్యాప్తు చేయాల్సిందిగా హోంమంత్రిత్వ శాఖను ఆదేశిస్తే… వైఎస్‌ చౌదరి ఏమంటున్నారంటే… అది కేవలం ఎకనాలెడ్జ్‌ మెంట్‌ అని, తన ప్రతిష్టను నేను దిగజారుస్తున్నాను అని అంటున్నారు. అది కేవలం ఎకనాలెడ్జ్‌ మెంట్‌ అయితే సుజనాచౌదరి ఎందుకు ఇంతగా భయపడుతున్నాడు.

5. చివరిగా ఒక్కమాట చెబుతున్నాను. కేవలం ఒక్క మనిషి … డిపాజిటర్లు ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ములను వేల కోట్ల మేరకు మింగేసినా… అలాంటి వ్యక్తిని వదిలేస్తే… ఇక భారతదేశంలో న్యాయం, చట్టం అనే పదాలకు విలువ వుండదు. సుజనాచౌదరి మీద నేను ఇచ్చిన సమాచారానికి కట్టుబడి వున్నాను. సీబీఐ విచారణను, ఈడీ విచారణను అడ్డుకోబోనని వైఎస్‌ చౌదరి పత్రికాప్రకటన చేస్తారా?

అంటూ విజయసాయి రెడ్డి సుజనా చౌదరిపై విమర్శలు గుప్పిస్తూ.. బహిరంగ లేఖ రాశారు.