నెరవేరిన విజయవాడ వాసుల కల: నేటి నుంచి అందుబాటులోకి బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్
విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరేలా వారి దశాబ్దాల కల నెరవేరేలా విజయవాడ నగరంలో వచ్చిన బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ పై నేటి(03 ఫిబ్రవరి 2020) నుంచి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే సాంకేతిక అంశాల పరిశీలన కోసం వంతెన పై నుంచి ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు అధికారులు.
అయితే ముందుగా విజయవాడలో ఈ వంతెనను కేవలం నిర్మల కాన్వెంట్ వరకే నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత భవిష్యత్తు అవసరాలను, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి కూడలి వరకు పొడిగించాలన్న అప్పటి సీఎం చంద్రబాబు, ఎంపీ కేశినేని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రం స్పందించి అనుమతులు ఇచ్చింది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే బెంజి సర్కిల్ లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గబోతుంది. అలాగే రూ.2వేల కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించినందున నగరంలో ట్రాఫిక్ రద్దీ తీరేందుకు బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ మరింత ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వంతెనపై వాహనాలు విడుదల చేసేదానికి ముందుగా జాతీయ రహదారుల విభాగం సంచాలకులు విద్యాసాగర్, ట్రాఫిక్ డీసీపీ నాగరాజులు వంతెనను తనిఖీ చేశారు. అలాగే కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు ఇవాళ మరోసారి వంతెనను పరిశీలించి వాహనాలకు పచ్చజెండా ఊపుతారు. ట్రయల్ రన్ పూర్తయ్యాక కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి చేతులు మీదుగా వంతెనను ప్రారంభిస్తారని తెలుస్తుంది.