సగం రాసిస్తే పేరు ఎక్కిస్తా.. : రైతును బెదరించిన వీఆర్వో

  • Published By: vamsi ,Published On : November 19, 2019 / 06:24 AM IST
సగం రాసిస్తే పేరు ఎక్కిస్తా.. : రైతును బెదరించిన వీఆర్వో

తెలంగాణలో పెట్రోల్ పట్టుకుని ఓ రైతు ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్లి అక్కడి ఎమ్మార్వోని హత్య చేసిన తర్వాత అనేకమంది రైతులు ఎమ్మార్వో ఆఫీసులలో సిబ్బందిపై వారి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఓ వైపు అత్యంత అవినీతి దేశవ్యాప్తంగా జరుగుతుంది రెవెన్యూ శాఖల్లోనే అంటూ ప్రజల నుంచి వ్యతిరేఖత వ్యక్తం అవుతుంది. మరోవైపు రిపోర్ట్‌లు కూడా ఈ విషయాలని స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి, చేసిన పని ఇప్పుడు కలకలం రేపుతుంది.

అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఆలం నవాజ్‌‌కు పిత్రార్జితంగా సర్వే నంబరు 175-4లో 1.02 ఎకరాల భూమి వచ్చింది. ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం కోసం అనేక దఫాలుగా కదిరి రెవెన్యూ అధికారులకు అర్జీలు పెట్టుకున్నారు. అయితే వీఆర్వో నరసింహారెడ్డి మాత్రం ఆ భూమికి పట్టా ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టరుకు ఫిర్యాదు చేశాడు నవాజ్.

పట్టాదారు పాసుపుస్తకం, 1బీకి సంబంధించి పేరు ఆన్‌లైన్‌లో ఎక్కించాలని పలు దఫాలుగా అర్జీలు ఇచ్చినా వీఆర్వో బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ బాధితుడు కలెక్టర్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఈ మేరకు సమస్యను కలెక్టర్‌కు వివరించారు నవాజ్.

సగం భూమి తాను చెప్పిన వాళ్లకు రాస్తేనే పనిచేస్తామని అంటున్నారని, లేకపోతే చేయం అని చెబుతున్నాడు అంటూ ఫిర్యాదు చేశాడు. నీ ఇష్టమొచ్చిన వారికి చెప్పుకో అంటూ బెదిరించి, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్.. కదిరి ఉప తహసీల్దారుతో బాధితుడిని వీసీ ద్వారా మాట్లాడించారు.

అనంతరం కలెక్టరు మాట్లాడుతూ అధికారులపై మండిపడ్డారు. తమాషా చేస్తున్నారా? భూమికి పట్టాదారు పాసుపుస్తకం, ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి భూమి ఇవ్వాలా? బాధితుడి సమస్య తక్షణమే పరిష్కరించి, తనకు నివేదించాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే ఉద్యోగం ఊడుతుందని వీఆర్వోను హెచ్చరించారు.