ప్రకాశం బ్యారేజ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్యయత్నం

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 05:46 AM IST
ప్రకాశం బ్యారేజ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్యయత్నం

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పై ఓ మహిళ తన మూడు సంవత్సరాల బాబుతో కలిసి నడుచుకుంటూ వస్తోంది. అలా నిదానంగా నడుచుకుంటూ వచ్చిన ఆమె హఠాత్తుగా..బాబుని వదిలేసి రెయిలింగ్ ఎక్కేసింది. తరువాత కృష్ణానదిలోకి దూకేసింది.  అక్కడే ఉన్న ఇద్దరు అది గమనించారు. వెంటనే బాబుని దగ్గరకు తీసుకున్నారు. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. 

వివరాల్లోకి వెళితే..తాడేపల్లికి చెందిన మహాలక్ష్మికి కొన్ని సంవత్సరాల క్రితం వెంకటేశ్వర్రావుతో వివాహం అయ్యింది. వారికి ఓ బాబు పుట్టాడు. ఈ క్రమంలో వారి కాపురంలో కలతలు రేగాయి. దీంతో మనస్తాపం చెందిన మహాలక్ష్మి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకుంది. అందుకోసం బుధవారం (ఫిబ్రవరి 19,2020)న ప్రకాశం బ్యారేజ్ వద్దకు తన కుమారుడితో కలిసి వచ్చింది. బ్యారేజ్ పై నడుచుకుంటూ వచ్చిన ఆమె హఠాత్తుగా బాబుని వదలేసి నదిలోకి దూకేసింది. 

తన చేయి పట్టుకుని అప్పటి వరకూ నడిపించిన తల్లి ఒక్కసారిగా నదిలో దూకేయటంతో ఆ పసివాడికి ఏమీ అర్ధకాలేదు. అలా బిత్తరు చూపులు చూస్తూ తల్లి దూకేసిన వైపుగా వెళ్లి కిందకు తొంగి చూస్తున్నాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆమె దూకేయటం గమనించిన స్థానికులు పరుగు పరుగున వచ్చిన బాబుని చేతుల్లోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు సమచారం అందించగా నదిలోకి దూకేసిన మహాలక్ష్మిని ఎట్టకేలకు సురక్షితంగా కాపాడారు. అనంతరం ఆమెను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. 

కొంతకాలంలో మహాలక్ష్మి, వెంకటేశ్వరరావు కాపురంలో గొడవలు జరుగుతున్నాయనీ..కారణం ఏంటీ అని అడిగితే ఇద్దరూ చెప్పటంలేదనీ..చెబితే పెద్దలు కూర్చుని మాట్లాడి సర్ధి చెబుదామంటే ఇద్దరూ నోరు విప్పకుండా వారిలో వారే కుమిలిపోతున్నారనీ..ఈ క్రమంలో మహాలక్ష్మి ఆత్మహత్యకు యత్నించిందనీ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని గానీ..ఆత్మహత్యకు యత్నించటం సరికాదని అంటున్నారు.