బంగాళాఖాతంలో అల్పపీడనం : ఉత్తరాంధ్రకు వర్షసూచన
తూర్పు మధ్య బంగాళాఖాతం లో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ… తదుపరి 24 గంటల్లో బలపడనుంది.
దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని… రాయలసీమలో పిడుగుల పడే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ తెలిపారు.
మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. పిడుగుల పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, చెరువు, నీటి కుంటల దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. విపత్తుల నివారణ శాఖ ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని,అధికారులను అప్రమత్తం చేసింది.
రాగల నాలుగు రోజులు వాతావరణ సూచనలు
జూన్ 9న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం. కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉంది.
జూన్ 10న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం అవకాశం ఉంది. తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. దీనితో పాటు రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉంది.
జూన్ 11,12న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. దీనితో పాటు రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉంది.