పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఎలాంటి ఆహారం అందించాలనేది చాలా మంది తల్లులకు ఎదురయ్యే ప్రశ్న.
పుట్టుకతో, తల్లిపాల ద్వారా, బలమైన ఆహారం అందించడం ద్వారా వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.
ఆహారం ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు.
ఇంట్లో వండిన తాజా ఆహారం ఎక్కువగా ఇవ్వాలి.
గోధుమ రవ్వ ఉప్మా, ఇడ్లీ, దోశ, కిచిడీ లాంటి బలవర్ధక పోషకాహారం అల్పాహారంగా ఇవ్వాలి.
తాజా పళ్ల ముక్కలు, కూరగాయ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కలిపి ఇవ్వాలి.
భోజనంలో కనీసం రెండు, మూడు రకాల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
బఠాణీ, బ్రొకోలి, తీపి మొక్కజొన్న, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యాప్సికం... ఇలా భిన్న కూరగాయలను కలిపి కూరగా వండి, వడ్డించాలి.
ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్డు తినిపించవచ్చు.
రోజు మొత్తంలో ఒక గ్లాసు పాలు ఇవ్వాలి. చికెన్, చేపలు తగిన మోతాదులో అందించాలి.
సోయాలో కూడా ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. పప్పుదినుసులతో కూడిన కిచిడీ, జీడిపప్పు వేసిన బొంబాయి రవ్వ ఉప్మాతో కూడా ప్రొటీన్ అందుతుంది.
రోజు మొత్తంలో కనీసం రెండు రకాల పండ్లు పిల్లలు తినేలా చూసుకోవాలి.
అరటిపండు, జామ పండు ద్వారా కూడా సరిపడా పోషకాలు అందుతాయి.
రోజు మొత్తంలో కనీసం రెండు, మూడు రకాల డ్రై ఫ్రూట్స్ తినేలా చూసుకోవాలి. వేరుశనగపప్పు కూడా మంచిదే.
బడికి వెళ్లే సమయంలో స్నాక్స్గా డ్రై ఫ్రూట్ పాయసం, ఫ్రూట్ సలాడ్, పళ్లముక్కలు ఇవ్వవచ్చు.