మోదీ ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వచ్చిన 24 గంటల్లోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్‭సభ సెక్రెటేరియట్ అనర్హత వేటు వేయడం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. రాహుల్ మీద అనర్హత వేటుతో ఒక్కసారిగా అనర్హత వేటు గురించి దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇందిరా, జయలలిత, లాలూ సహా పలువురు ఈ వేటు ఎదుర్కొన్నారు. ఎవరెవరు ఎప్పుడు ఎందుకు అనర్హత వేటు ఎదుర్కొన్నారో చూద్దామా..

ఇందిరా గాంధీ - 1975లో ఇందిరా గాంధీ తన లోక్‭సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ విజయం చెల్లదని జూన్ 12, 1975న, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగ్‌మోహన్‌లాల్ సిన్హా ప్రకటించారు. ఎన్నికల దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు గాను ఆమెపై ఈ వేటు విధించారు.

లాలూ ప్రసాద్ యాదవ్ - దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‭ మీద 2013లో ఐదేళ్లపాటు జైలు శిక్షతో పాటు అనర్హత వేటు విధించారు. అప్పుడు ఆయన బిహార్ రాష్ట్రంలోని సరన్ లోక్‭సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జయలలిత - ఆదాయానికి మించి ఆస్తులు కలిగినందుకు గాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద 2017లో 4 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు అనర్హత వేటు వేశారు. దీంతో పాటు 100 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించారు. ఆ సమయంలో ఆమె ఆర్.కే నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

టీ.ఎం సెల్వగనపతి - డీఎంకేకు చెందిన టీ.ఎం సెల్వగనపతి.. 2014లో రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలో స్మశాన వాటిక కేసులో రెండేళ్ల జైలు శిక్షతో పాటు అనర్హత వేటు ఎదుర్కొన్నారు.

పప్పు కలాని - మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన పప్పు కలాని, 2013లో ఒక కేసులో దోషిగా తేలడంతో అనర్హత వేటు పడింది.

కమల్ కిశోర్ భగత్ - మర్డర్ కేసులో కోర్టు దోషిగా తేల్చడంతో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ నేత కమల్ కిశోర్ భగత్ మీద 2015లో అనర్హత వేటు పడింది. ఆయన జర్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యుడుగా ఉన్నారు.

రషీద్ మసూద్ - ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎంపీ పని చేసిన రషీద్ మసూద్.. 2013లో ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు అనర్హత వేటు ఎదుర్కొన్నారు.

ఆశా రాణి - మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని బిజావర్ నుంచి బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా రాణి మీద పనిమనిషిని ఆత్మహత్య చేసిన కేసులో 2013లో దోషిగా తేలడంతో అనర్హత వేటు వేశారు.

జగదీష్ శర్మ - బిహార్ రాష్ట్రంలోని జహానాబాద్ లోక్‭సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న జేడీయూ నేత జగదీష్ శర్మకు 2013లో దాణా కుంభకోణం కేసులో 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం ఆయనను ఎన్నికల పోటీకి అనర్హుడిగా ప్రకటించారు.

బాబన్‭రావు ఘోలప్ - శివసేకు చెందిన బాబన్‭రావు ఘోలప్.. మహారాష్ట్రలోని డియోలాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం అనర్హత వేటు వేశారు.

ఎనోస్ ఎక్కా - ఖార్జండ్‭కు చెందిన ఎనోస్ ఎక్కా.. 2013లో ఒక సీరియస్ కేసులో ఆయన మీద అనర్హత వేటు వేడయంతో పాటు జీవిత ఖైదు విదించారు.

సురేశ్ హల్వాంకర్ - మహారాష్ట్రలోని ఉచల్కారంజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సురేశ్ హల్వాంకర్ మీద 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు అనర్హత వేటు వేశారు. దొంగతనం కేసులో ఆయనకు ఈ వేటు పడింది.