తెలుగు వాళ్లకి , సినిమా వాళ్ళకి కూడా పెద్ద పండగ సంక్రాంతి. సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఎప్పట్నుంచో ముందే ప్లాన్ చేసుకుని మరీ రంగంలోకి దిగుతారు స్టార్ హీరోలు.

2022 సంక్రాంతికి కోవిడ్ దెబ్బకి పెద్ద సినిమాలు ఎక్కువగా రాలేదు కానీ ఈ సారి వచ్చే సంక్రాంతికి స్టార్ హీరోలు తమ సినిమాలని అనౌన్స్ చేసి ఇప్పట్నుంచే పోటీ మొదలుపెడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - బాబీ డైరెక్షన్ లో చిరంజీవి 154వ సినిమా సంక్రాంతికే థియేటర్లోకి వస్తున్నట్టు అనౌన్స్ చేశారు

తమిళ హీరో విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న వారసుడు సినిమాని కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు నిర్మాత దిల్ రాజు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న ‘ఆదిపురుష్’ సినిమా కూడా సంక్రాంతికే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు మేకర్స్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల వల్ల ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ డిలే అవుతుంది. అనుకున్న టైంకి షూట్ కంప్లీట్ అయితే పవన్ ని కూడా సంక్రాంతి బరిలోనే దింపడానికి చూస్తున్నారు డైరెక్టర్ క్రిష్.

మహేష్ కి బాగా కలిసొచ్చిన సీజన్ సంక్రాంతి. దీంతో ఈ సారి కూడా సంక్రాంతికి మహేష్ రావాలనుకుంటున్నాడు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాని సంక్రాంతికే బరిలోనే దించుతున్నట్టు సమాచారం. కానీ ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టలేదు కాబట్టి ఈ సినిమా సంక్రాంతికి అనుమానమే అంటున్నారు అభిమానులు.

ఇక ఉప్పెనతో మంచి ఫేమ్ తెచ్చుకున్న యువ హీరో పంజా వైష్ణవ తేజ్ తన నాలుగో సినిమాని ఫుల్ మాస్ యాక్షన్ సినిమాగా త్రివిక్రమ్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని ఆల్రెడీ సంకాంతికి అనౌన్స్ కూడా చేసేశారు.

ఇప్పటికే దాదాపు అరడజను సినిమాలు సంక్రాంతిని టార్గెట్ పెట్టుకున్నాయి. వీటికి మరిన్ని జత చేరినా ఆశ్చర్యపోనవసరంలేదు.