దేశం నేడు 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం దేశ ప్రజలందరూ తన కుటుంబమని పేర్కొంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు.

రాబోయే ఐదేళ్లలో భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్నదని ప్రధాని అన్నారు.

దేశంలో 25,000 జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు లక్ష్యంతో పని చేస్తామని అన్నారు. జన ఔషధి కేంద్రాలు ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు కొత్త శక్తిని అందించాయని కొనియాడారు.

వచ్చే నెల విశ్వకర్మ జయంతి సందర్భంగా 'విశ్వకర్మ యోజన'ను ప్రారంభిస్తామని ప్రకటించారు. విశ్వకర్మ పథకంలో 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తద్వారా పేదలకు మందులు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పశువులను రక్షించడానికి టీకాలకు సుమారు 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో రూ.2.5 లక్షల కోట్లు జమ చేసినట్లు పేర్కొన్న మోదీ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించేందుకు జల్ జీవన్ మిషన్‌పై రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు మన యువత ప్రపంచంలోని మొదటి మూడు స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో భారతదేశానికి స్థానం కల్పించిందని అన్నారు.

2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం 10వ స్థానంలో ఉన్నామని, నేడు ఐదో స్థానానికి చేరుకున్నామని చెప్పారు.

గతంలో పేదలకు ఇళ్లు కట్టించేందుకు 90 వేల కోట్లు వెచ్చించారని, నేడు నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. గత ఐదున్నరేళ్లలో 13.50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్లు తెలిపారు.

దేశంలో రైల్వేలు ఆధునికమవుతున్నాయని, అందుకే దేశంలో వందేభారత్ రైలు కూడా నడుస్తోందని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కాంక్రీట్ రోడ్లు నిర్మిస్తున్నారని, ఎలక్ట్రిక్ బస్సులు-మెట్రోలు కూడా నిర్మిస్తున్నారని, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తోందని అన్నారు.

స్వయం సహాయక సంఘాలను ప్రశంసించిన ప్రధాని మోదీ.. రెండు కోట్ల మందిని లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.