Goa: భారతమాత ముద్దుబిడ్డలైన లక్షలాది మంది త్యాగఫలంగా ప్రస్తుతం మనమంతా స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం. ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు, మాతృభూమి స్వేచ్ఛ కోసం మొక్కవోని దీక్షతో, అంకిత భావంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో సాహసవంతులుగా పేర్లు లిఖించి మనకు స్వాతంత్ర్యాన్ని అందించారు. అలాంటి త్యాగధనులకు నివాళిని అర్పించేందుకు.. వారి త్యాగాలను భావితరాలకు స్ఫూర్తి దాయకంగా అందించేందుకు ప్రతి ఏడాది పంద్రాగస్టున ఇండియా స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించుకొనే సంగతి తెలిసిందే.
యావత్ భారత దేశం ప్రతి ఏడాది పంద్రాగస్టున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నా ఒక్క గోవా రాష్ట్రం మాత్రం ఆ రోజున ఈ వేడుకలకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగష్టు 15న గోవాకు స్వాతంత్య్రం లభించలేదు. ఇండియాకు బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి లభించినా గోవా ప్రజలకు మాత్రం పరాయి పాలన నుండి మాత్రం విముక్తి కలగలేదు. దేశమంతా బ్రిటిష్ వారి పాలనలో ఉంటే.. గోవా అప్పటికి పోర్చుగీసు వారి పాలనలో ఉండేది.
1947 ఆగష్టు 15న బ్రిటిష్ వారు దేశాన్ని విడిచి వెళ్లినా పోర్చుగీసు వారి ఇండియాను వీడలేదు. నిజానికి ఇండియాకు ముందుగా వచ్చింది పోర్చుగీసు వారే కాగా చివరిగా దేశాన్ని విడిచి వెళ్ళింది కూడా వారే. బ్రిటిష్ వాళ్ళు 1947లో ఇండియాను విడిచి వెళ్తే పోర్చుగీసు వారు మాత్రం 1961 డిసెంబర్ 19న గోవాను విడిచివెళ్లారు. సుమారు 450 ఏళ్ల తర్వాత గోవాకు విముక్తి లభించింది. అందుకే భారత దేశమంతా పంద్రాగస్టున స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నా ఒక్క గోవా మాత్రం వేడుకలకు దూరంగా ఉంటుంది.