TRS Rajyasabha: త్వరలో రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ బుధవారం ప్రకటించింది. మూడు స్థానాలకుగాను అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. హెటిరో డ్రగ్స్ అధినేత డా.బండి పార్థసారధి రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావు పేర్లను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. కాగా, టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ గతేడాది డిసెంబర్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బండప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి జరిగే ఉప ఎన్నిక కోసం వీరిలో ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా, రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది.
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్గా స్ట్రాటజిస్ట్ సర్వే వ్యవహారం
తాజాగా టీఆర్ఎస్ ఎంపిక చేసిన ముగ్గురిలో ఎవరు ఈ ఎన్నికకోసం నామినేషన్ వేస్తారో రేపటిలోగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం వచ్చే నెలలో ముగియనుంది. ఈ రెండు స్థానాలకు కూడా ఎన్నిక జరగనుంది. ఈ నెల 24నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాగా, రాజ్యసభ స్థానానికి సంబంధించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు వినిపించినప్పటికీ, తుది జాబితాలో ఆయన పేరు లేదు.