Parineeti Chopra : శుద్ధ్ దేశీ రొమాన్స్, హసీ తో ఫసీ, గోల్ మాల్ అగైన్, కేసరి, సైనా… లాంటి పలు సినిమాలతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పరిణీతి చోప్రా. ఇటీవలే ఊంఛాయ్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ప్రస్తుతం క్యాప్సూల్ గిల్, చమ్కీలా అనే రెండు సినిమాలతో షూటింగ్స్ లో బిజీగా ఉంది పరిణీతి. సినిమాల పరంగా ఇప్పటికే పలు అవార్డులు సాధించిన ఈ బాలీవుడ్ భామ తాజాగా ఇంగ్లాండ్ కి సంబంధించిన ఓ అవార్డు అందుకుంది.
భారతదేశంకి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా బ్రిటీష్ కౌన్సిల్ ఇంగ్లండ్లో చదువుకొని, వివిధ రంగాల్లో బాగా స్థిరపడిన 75 మంది భారతీయులకు India UK Achievers అవార్డులు ప్రకటించింది. ఆర్ట్స్, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ Outstanding Achiever Award పరిణీతి చోప్రాకు దక్కింది. పరిణీతి చోప్రా ఇంగ్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి బిజినెస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసింది.
ఈ అవార్డు అందుకున్నందుకు పరిణీతి సంతోషం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో.. నేను India UK Achievers అవార్డుల్లో Outstanding Achiever Award ఆర్ట్స్, ఎంటర్టైన్మెంట్ రంగంలో సాధించినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎక్కడైతే నా చదువు మొదలుపెట్టానో మళ్ళీ అక్కడికే వచ్చి ఈ అవార్డు తీసుకున్నాను. జీవితం ఒక వృత్తం లాంటిది. ఎక్కడ మొదలుపెడితే అక్కడికి ఏదో ఒక రోజు వస్తాము. ఈ అవార్డు సెలబ్రేషన్స్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు అందించిన బ్రిటిష్ కౌన్సిల్ కి ధన్యవాదాలు అని తెలిపింది. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.