Srivari Pushpayagam 2021 : తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి సర్వం సిద్ధమైంది. అలంకార ప్రియుడు, నిత్య కల్యాణ స్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడికి…అర్చకులు గురువారం పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి బుధవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో శ్రీవారికి నిర్వహించే ప్రథమ ఉత్సవం…పుష్పయాగ మహోత్సవం. కార్తీక మాసంలో శ్రవణానక్షత్రం రోజున ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామికి పుష్పయాగం నిర్వహించడం అనాయితీగా వస్తోంది.
Read More : Riya Chakravarthi: సుశాంత్ కేసులో రియాకి చిన్న రిలీఫ్..
ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేసి.. స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5గంటల వరకు….శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తర్వాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. పుప్పయాగం సందర్భంగా వర్చువల్, ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.
Read More : Pakistan Supreme Court : మిస్టర్ పీఎం..హంతకులతో చర్చలా ?
పుష్పయాగానికి టీటీడీ 8టన్నుల పుష్పాలు సేకరించింది. కర్నాటక, తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాతల సాయంతో పుష్పాల సేకరణ చేశారు. కర్నాటక నుంచి నాలుగు టన్నులు, తమిళనాడు నుంచి మూడు టన్నులు, ఏపీ, తెలంగాణ నుంచి టన్ను పుష్పాలు సేకరించారు. 14రకాల పుష్పాలు.. 6రకాల పత్రాలతో ఏడుకొండల వెంకన్నకు పుష్పార్చన జరగనుంది. శ్రీవారి పాదాల నుంచి హృదయం వరకు పుష్ప నివేదన చేసి…ఆ తర్వాత తొలగిస్తారు. ఇలా 7 సార్లు శ్రీవారికి పుష్పార్చన జరుగుతుంది. అనంతరం ఉత్సవమూర్తులకు హారతిని సమర్పించడంతో పుష్పయాగం శోభాయామానంగా ముగుస్తుంది.