Vasantha panchami 2022 : సరస్వతీదేవి ని మాఘ పంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
అక్షరాల అధిదేవత సకల విద్యల రాణి, జ్ఞాన ప్రదాయిని, సరస్వతిదేవి జన్మదినమే వసంత పంచమిగా జరుపుకుంటారు. సంగీత నృత్య, సాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు.
ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. వసంత పంచమి సందర్భంగా జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువైన ఆదిలాబాద్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే భక్తులు అమమ్మవారి ఆలయానికి చేరుకుని క్యూలైన్లలో వేచి ఉన్నారు.
శనివారం తెల్లవారుఝూమున 2 గంటలకు అర్చకస్వాములు అమ్మవారికి అభిషేకంతో ఉత్సవానికి అంకురార్పణ చేశారు. చిన్న పిల్లలకు, తల్లితండ్రులు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఈ క్రింది శ్లోకాన్ని చదివితే జ్ఞానం వృధ్ది చెంది అన్నింటా విజయం కలుగుతుందని భక్తుల నమ్మకం.
శరదిందు సమాకారే
పరబ్రహ్మ స్వరూపిణే|
వాసరా పీఠ నిలయే
సరస్వతీ నమోస్తుతే||