MLC Kavitha – ED: ఈడీ నోటీసులు పంపుతుండడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కు ఈడీ మరోసారి నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.
దీంతో నిజామాబాద్లో కవిత ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈడీ నోటీసులపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇటువంటివి సాధారణమేనని అన్నారు. టీవీ సీరియల్లాగా ఈడీ వ్యవహారం కొనసాగుతుందని చెప్పారు. తమ లీగల్ టీమ్ సలహా మేరకు తాము ముందుకెళతామని అన్నారు.
పొత్తులపై..
తమకు ఎవరితోనూ పొత్తు లేదని ప్రజలతోనే పొత్తు ఉంటుందని కవిత చెప్పుకొచ్చారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. తాము నిజామాబాద్లో ఏడు కొత్త చేపల మార్కెట్లను మంజూరు చేశామని తెలిపారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో తాము ఎప్పటికప్పుడు జాబ్ మేలాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 4000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు.