జీవన్‌రెడ్డి.. మరోసారి తన రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తారా?

ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన జీవన్‌రెడ్డి.. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో మళ్లీ గెలిస్తే మంత్రి అవుతానని అంచనాతో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

congress leader jeevan reddy: ఉత్తర తెలంగాణలో మరో పొలిటికల్ ఫైట్‌కు రంగం సిద్ధమవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పదవీకాలం పూర్తికావడంతో కొద్దిరోజుల్లో ఎన్నికకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన జీవన్‌రెడ్డి.. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా ఓటమి చవిచూశారు. ఇక ఎంపీగాను పోటీ చేసి ఎదురుదెబ్బే తిన్నారు. ఇక ఇప్పుడు రెండోసారి పోటీ చేస్తారా? లేక కొత్తవారికి అవకాశమిస్తారా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణలో పట్టున్న ఓ విద్యాసంస్థల అధినేత కూడా పోటీకి సై అంటుండటం.. ఎమ్మెల్సీ వార్‌ను ఆసక్తికరంగా మార్చేస్తోంది.

జీవన్‌రెడ్డి రెండోసారి పోటీ చేస్తారా?
ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక త్వరలో జరగనుంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలో పట్టభద్రులు ఎన్నుకునే ఎమ్మెల్సీ పదవి కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో చాలా మంది ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా, ఆయన రెండోసారి పోటీ చేస్తారా? లేదా? అన్నదే ఉత్కంఠ రేపుతోంది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన జీవన్‌రెడ్డి.. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో మళ్లీ గెలిస్తే మంత్రి అవుతానని అంచనాతో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీలో పలువురు నేతలు తమకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ను కోరుతున్నట్లు సమాచారం.

సరైన అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్, బీజేపీ వేట
ఇక బీఆర్‌ఎస్, బీజేపీల్లో కూడా చాలా మంది పోటీకి ఉత్సాహం చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కంటే పార్టీ బలం పుంజుకోవడంతో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే గెలుపు ఈజీ అని కలలు కంటున్న బీజేపీ.. సరైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. పార్టీ తరఫున పోటీకి ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు చెబుతున్నా.. పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ భోగ శ్రావణి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్లోనూ పోటీకి చాలా మంది సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తాను పోటీలో ఉంటున్నట్లు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు గెలుపు గుర్రం కోసం పార్టీ అన్వేషణ కొనసాగిస్తోంది.

Also Read: పీసీసీ చీఫ్ ఎవరు.. కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకింత ఆలస్యం చేస్తోంది..?

రేసులో నరేందర్ రెడ్డి మాస్టారు
ప్రధాన పార్టీలు అన్నీ.. సరైనోళ్ల కోసం అన్వేషణ కొనసాగిస్తుంటే.. ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి సైతం పోటీకి సై అంటున్నారని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో విద్యా సంస్థలను విస్తరించిన నరేందర్ రెడ్డి మాస్టారుగా సుపరిచితులు. ఇప్పుడు రాజకీయల వైపు ఆసక్తి చూపుతున్న నరేందర్‌రెడ్డి పక్కాగా గెలుస్తాననే ధీమాతో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీకి రెడీ అవుతున్నారంటున్నారు. ఇప్పటికే తన అభ్యర్థిత్వంపై సర్వే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంతోపాటు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో ఏ పార్టీపై పట్టభద్రుల్లో మొగ్గు ఉందని కూడా ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. తన విద్య సంస్థల్లో పనిచేసిన వారు, చదువుకుని పెద్దైన వారు ఓట్లేస్తే గెలుస్తానని ధీమా ప్రదర్శిస్తున్నారు నరేందర్‌రెడ్డి. స్వతంత్రంగా పోటీ చేయాలని ఉబలాటపడుతున్న నరేందర్‌రెడ్డి.. కాంగ్రెస్, బీజెపీతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీల్లో ఎవరు టిక్కెట్ ఇచ్చిన పోటీకి రెడిగా ఉన్నారంటున్నారు.

Also Read: అందుకే బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును పొగుడుతున్నారు: ఆది శ్రీనివాస్

మొత్తానికి మూడు ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు పోటీకి సిద్ధమవుతుండటంతో ఎమ్మెల్సీ ఎన్నికపై ఆసక్తి ఎక్కువవుతోంది. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన జీవన్‌రెడ్డి మరోసారి తన రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకుని పోటీ చేస్తారా? లేక పెద్దల సభతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఇదే సమయంలో ఆయన మళ్లీ పోటీ చేస్తే.. యువ నేతలైన రాణిరుద్రమ, భోగ శ్రావణి వంటి వారితో తలపడాల్సివస్తోంది. ఇప్పటికే జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో భోగ శ్రావణి, జీవన్‌రెడ్డిలు ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఏదైనా సరే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనుభవజ్ఞులకు.. యువ నేతలకు మధ్య ఆసక్తికర పోటీకి దారితీస్తుందనే చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు