Digital Rupee : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశంలోని ముందుగా 4 నగరాల్లో డిజిటల్ రూపాయి (Digital Rupee) పైలట్ను ప్రారంభించింది. ఎట్టకేలకు సామాన్యులకు డిజిటల్ రూపాయి అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టడం వెనుక ప్రాథమిక ఆలోచన ఏమిటంటే.. దేశంలో చివరికి పేపర్ కరెన్సీని తగ్గించడమే కాకుండా కరెన్సీ నిర్వాహణ ఖర్చును తగ్గించుకోవడమేనని చెప్పవచ్చు. డిజిటల్ రూపాయి లేదా ఇ-రూపాయి క్రిప్టోకరెన్సీకి ఏ విధంగానూ లింక్ లేదనే విషయాన్ని గమనించాలి. అలాగే బ్లాక్చెయిన్ టెక్నాలజీపై కూడా ఈ డిజిటల్ రూపాయి ఆధారపడదని చెప్పవచ్చు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. డిజిటల్ రూపాయి లేదా డిజిటల్ కరెన్సీ అనేది నగదు/కాగితపు కరెన్సీకి డిజిటల్ రూపమని చెప్పవచ్చు. ఇప్పుడు డిజిటల్ రూపాయి, పేపర్ మనీ విలువ కూడా ఒకటే అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు.. 1 డిజిటల్ రూపాయి.. 1 రూపాయి నగదుకు సమానంగా ఉంటుంది. అస్థిర మార్కెట్, విలువ మార్కెట్ను బట్టి హెచ్చుతగ్గులకు లోనయ్యే క్రిప్టో కరెన్సీ మాదిరిగా ఉండదు. డిజిటల్ రూపాయి విలువ ఎప్పుడూ మారదు. కాగితం కరెన్సీ, నాణేల వలె అదే విలువలను కలిగి ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైలట్ ప్రాజెక్టులో భాగంగా ముందుగా ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్తో సహా 4 నగరాల్లో డిజిటల్ రూపాయిని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ ప్రారంభ ట్రయల్ కోసం.. RBI నాలుగు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంక్, Yes బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి. ఈ పైలట్ ట్రయల్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత.. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్తో సహా మరో 4 బ్యాంకులకు RBI భాగస్వామ్యాన్ని విస్తరించనుంది.
రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు కూడా ఈ డిజిటల్ రూపాయి సర్వీసులను విస్తరింపజేయనున్నారు. రెండవ దశలో డిజిటల్ రూపాయి అందుబాటులోకి వచ్చే నగరాల్లో అహ్మదాబాద్, గ్యాంగ్టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లా ఉన్నాయి.
పైలట్ ప్రాజెక్టు ప్రారంభైన సందర్భంగా కస్టమర్లకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ డిజిటల్ రూపాయి ఎలా పని చేస్తుంది. ఇ-రూపీని ఎలా ఉపయోగించవచ్చు? అది వినియోగదారులకు ఎలా ఉపయోగపడుతుంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే డిజిటల్ రూపాయి గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు పూర్తి సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం..
1. డిజిటల్ రూపాయి క్రిప్టోకరెన్సీని పోలి ఉంటుందా? :
కాదనే చెప్పాలి.. డిజిటల్ రూపాయి (Digital Rupee), క్రిప్టోకరెన్సీ (cryptocurrency) రెండు వేర్వేరు విషయాలు అనేది గుర్తించుకోవాలి. ఏ విధంగానూ ఒకదానితో ఒకటి లింక్ చేయడం కుదరని పని.. క్రిప్టో బ్లాక్చెయిన్పై ఆధారపడి పనిచేస్తుంది. అదే డిజిటల్ రూపాయి విషయంలో అలా కాదు. కొత్తగా ప్రారంభమైన డిజిటల్ రూపాయి ప్రాథమికంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ఆధారంగా పనిచేస్తుంది.
దీని వెనుక ప్రాథమిక ఆలోచన దేశ మార్కెట్ నుంచి చివరికి పేపర్ కరెన్సీ తొలగించడం.. క్రిప్టో, డిజిటల్ రూపాయి సరిపోలని అంశం వాటి విలువ.. క్రిప్టోకరెన్సీ అనేది రిస్క్తో నడిచే మార్కెట్.. ఇది మార్కెట్ పరిస్థితులను బట్టి దాని విలువ మారుతుంది. కానీ, డిజిటల్ రూపాయి విషయంలో అలా కాదు. దాని విలువ పేపర్ కరెన్సీ మాదిరిగానే అంతటా అలాగే ఉంటుంది.
2. పేపర్ కరెన్సీకి, డిజిటల్ రూపాయికి తేడా ఏంటి? :
రెండింట్లో ఒకే తేడా ఏమిటంటే.. పేరులోనే అది డిజిటల్ రూపాయి.. కానీ, పేపర్ కరెన్సీకి డిజిటల్ ఫార్మాట్ అని చెప్పవచ్చు. డిజిటల్ రూపాయి, పేపర్ కరెన్సీ విలువ ఒకే విధంగా ఉంటుంది. డిజిటల్ రూపాయిని నిర్వహించడం చాలా సులభంగా ఉంటుంది. అలాగే ఎంతో చౌకగానూ ఉంటుంది.
3. డిజిటల్ రూపాయిని ఎలా కొనాలి? :
ప్రారంభ ట్రయల్లో భాగంగా.. RBI తమ వినియోగదారులుకు డిజిటల్ రూపాయిని విడుదల చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంక్, Yes బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ వంటి నాలుగు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం, ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్లలో RBI పైలట్ ట్రయల్ ప్రారంభించింది. డిజిటల్ రూపాయిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఈ నాలుగు బ్యాంకుల్లోనే ఏదైనా అధికారిక యాప్ లేదా వెబ్సైట్కి వెళ్లాల్సి ఉంటుంది.
ప్రస్తుతానికి, RBI డిజిటల్ రూపాయిని కొనుగోలు చేయడానికి కచ్చితమైన ప్రక్రియను వెల్లడించలేదు. అయితే కస్టమర్లు రిటైలర్ వంటి దుకాణాల్లో QR కోడ్లను ఉపయోగించి డిజిటల్ రూపాయితో చెల్లింపులు చేయవచ్చు. అప్పుడు నేరుగా బ్యాంకు వ్యాలెట్ నుంచి చెల్లించిన మొత్తం కట్ అవుతుందని చెప్పవచ్చు.
4. డిజిటల్ రూపాయిని ఉపయోగించి షాపింగ్ చేయవచ్చా? :
అవును… తప్పకుండా షాపింగ్ చేయవచ్చు. వినియోగదారులు తమ సమీపంలోని కిరానా స్టోర్ల నుంచి వస్తువులను కొనుగోలు చేయడానికి, షాపింగ్ చేయడానికి డిజిటల్ రూపాయిని ఉపయోగించవచ్చునని RBI స్పష్టంగా పేర్కొంది. డిజిటల్ రూపాయిలో లావాదేవీలు ఒక వ్యక్తి నుంచి వ్యక్తి (P2P), వ్యక్తి నుంచి వ్యాపారి (P2M) మధ్య జరుగుతుంది. ఇ-రూపీతో విశ్వాసం, భద్రత వంటి ఫిజికల్ కరెన్సీ ఫీచర్లను అందిస్తుంది. నగదు విషయంలో మాదిరిగానే.. ఎలాంటి వడ్డీని పొందలేరు. బ్యాంకులలో డిపాజిట్ల వంటి ఇతర రూపాల్లోకి మార్చుకోవాల్సి ఉంటుందని RBI అధికారికంగా పేర్కొంది.
5. డిజిటల్ కరెన్సీని స్నేహితులకు బదిలీ చేయవచ్చా? :
అవును.. చేయవచ్చు.. వినియోగదారులు డిజిటల్ రూపాయిని స్నేహితులు, కుటుంబ సభ్యులకు బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి, డిజిటల్ రూపాయి బదిలీ ప్రక్రియకు నియమించిన బ్యాంకులు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్, Yes బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్) మాత్రమే సపోర్టు చేస్తాయని గమనించాలి. వినియోగదారులు Paytm వ్యాలెట్లో నగదును ఉంచుకున్నట్టే.. డిజిటల్ రూపాయిని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు అన్ని లావాదేవీలకు ఉపయోగించవచ్చు.