Deen Dayal Upadhyaya University: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖ్పూర్లో దారుణం చోటు చేసుకుంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, రిజిస్ట్రార్ లపై భారతీయ జనతా పార్టీకి చెందిన విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషద్ కార్యకర్తలు దాడి చేశారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చి పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో వైస్ చాన్స్లర్ రాజేష్ సింగ్, రిజిస్ట్రార్ అజయ్ సింగ్ సహా పలువురు పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైస్ చాన్స్లర్, రిజిస్ట్రార్ చాంబర్లను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఘర్షణ వాతావరణం నెమ్మదించింది. ఈ ఘర్షణకు సంబంధించి 10 మంది ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీలో ఆక్రమణలు జరుగుతున్నాయని ఏబీవీపీ కార్యకర్తలు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ విషయమై శుక్రవారం వైస్ చాన్స్లర్ను కలిసేందుకు ప్రయత్నించగా, ఆయన అనుమతి ఇవ్వలేదు. దీంతో తీవ్ర కోపోద్రిక్తమైన ఏబీవీపీ కార్యకర్తలు, ఆయనపైనే దాడికి దిగారు.
విద్యార్థి సంఘం తెలిపన దాని ప్రకారం.. ఇది చాలా కాలంగా కొనసాగుతోందని, అయితే యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చినా నేటికీ సమస్యలు పరిష్కరించలేదని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. ఈ విషయమై జూలై 13న యూనివర్సిటీ క్యాంపస్లో ఏబీవీపీ కార్యకర్తలు వైస్ ఛాన్సలర్ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఉపకులపతి నివేదిత విద్యార్థుల సమస్యలను విని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
गोरखपुर यूनिवर्सिटी में ABVP वालों ने पहले दरोगा जी को पीटा फिर यूनिवर्सिटी के कुलपति और रजिस्ट्रार को दौड़ा-दौड़ाकर पीटा।
यूनिवर्सिटी का झगड़ा है, बहुत लोड नहीं लेना चाहिए। यही युवा नेता आगे चलकर प्रदेश के मुख्यमंत्री और देश के पीएम बनेंगे।
बाकी पुलिस तो माफ कर ही देगी। 😉 pic.twitter.com/wZVCC4l3Kr
— Rajesh Sahu (@askrajeshsahu) July 21, 2023
అయితే ఆ తర్వాత గొడవకు కారణమైన నలుగురు ఏబీవీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ డీన్ సత్యపాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుకు నిరసనగా విద్యార్థులు శుక్రవారం వైస్ ఛాన్సలర్ను కలిసేందుకు వెళ్లగా, ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. కోపంతో రగిలిపోయిన ఏబీవీపీ కార్యకర్తలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వైస్ చాన్స్లర్ చాంబరుకు వచ్చి ఉద్రిక్తత సృష్టించారు. ఆయన చాంబరును ధ్వంసం చేసి, ఆయనపై దాడి చేశారు. అనంతరం రిజస్ట్రార్, పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు.