Russian Missiles : పశ్చిమ యుక్రెయిన్ నగరమైన ఎల్వివ్లోని ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్ను శుక్రవారం ఉదయం (మార్చి 18) రష్యా బలగాలు క్షిపణులతో ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని నగర మేయర్ ఆండ్రీ సడోవి వెల్లడించారు. రష్యా క్షిపణుల దాడి అనంతరం ఎల్వివ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆకాశంలో దట్టమైన పొగలు వ్యాపించాయని ఆయన చెప్పారు. సమాచారం అందిన వెంటనే అంబులెన్స్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. రష్యా ప్రయోగించిన క్షిపణులు ఎయిర్క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్ను పేల్చేశాయని మేయర్ ఆండ్రీ సడోవి మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ద్వారా వెల్లడించారు. రష్యా దాడుల్లో ఎయిర్ క్రాఫ్ట్ ప్లాంట్ పూర్తిగా ధ్వంసమైందన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. దాడి కారణంగా ఆ ప్లాంట్లో కార్యకలాపాలు నిలిచిపోయాయని నగర మేయర్ వెల్లడించారు.
ఎల్వివ్ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో రష్యన్ దళాలు దాడి చేశాయని అన్నారు. రష్యా దాడుల నేపథ్యంలో విమానాశ్రయ మార్గంలో వెళ్లే వాహనాలను మరో మార్గానికి దారిమళ్లించారు. ప్రాథమిక సమాచారం మేరకు.. రష్యా ప్రయోగించిన ఆరు క్రూయిజ్ క్షిపణులైన X-555 నల్ల సముద్రం నుంచి ప్రయోగించినట్టు చెప్పారు. అయితే అందులో రెండు క్షిపణులను యుక్రెయిన్ వైమానిక దళం ధ్వంసం చేసినట్లు ప్రకటనలో తెలిపారు. ఎల్వివ్ పశ్చిమ యుక్రెయిన్లోని అతిపెద్ద నగరం. ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పేరొంది.
గత వారాంతంలో రష్యన్ క్రూయిజ్ క్షిపణులు ఎల్వివ్కు పశ్చిమాన ఉన్న సైనిక స్థావరాన్ని ధ్వంసం చేశాయి. ఈ దాడిలో 35 మంది మరణించారు 130 మందికిపైగా గాయపడ్డారు. ఈయూ సభ్యుల్లో ఒకటైన పోలాండ్ సరిహద్దు నుంచి 70 కిలోమీటర్లు (45 మైళ్ళు) దూరంలో ఉన్న ఈ ఎల్వివ్ నగరం ఉంది. ఫిబ్రవరి 24న రష్యా దళాలు యుద్ధం ఆరంభించినప్పటి నుంచి చాలారోజుల వరకు ఈ నగరం సురక్షితంగానే ఉంది. కానీ, ఇప్పుడు ఎల్వివ్ లోని ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ ప్లాంటును రష్యా క్షిపణులు ధ్వంసం చేశాయి. రష్యా క్షిపణలు దాడులతో ఈ నగర వాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Russian-Ukraine War : స్కూల్ పై రష్యా దాడులు..21 మంది మృతి..మరో 10మంది పరిస్థితి విషమం