Women gives birth to baby under Syria earthquake : చావు పుట్టుక ఎలా సంభవిస్తాయో ఎవ్వరికి తెలియదు. ‘కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం’. ఈ మాట వెనుక ఉన్న అంతరర్ధాన్ని తెలుసుకోవటం మానవమాత్రులకు సాధ్యం కాదు. ప్రకృతి విలయ తాండవం చేస్తున్నా ఈ జనన మరణాలకు సంబంధంలేదు. అటువంటి ఓ హృదయ విదారక ఘటనకు వేదికైంది సిరియాలోని భూకంప దుర్ఘటన. ఓ బిడ్డకు జన్మనిచ్చి మరణించింది ఓ తల్లి. సిరియా భూకంప శిథిలాలు ఓ పుట్టుకకు వేదికైతే మరో మరణానికి కూడా సజీవ సాక్ష్యంగా నిలిచాయి.
లయకారుడి తాండవంతో సృష్టి వినాశనానికి మాత్రమే కాదు చావుపుట్టుకలకి కూడా కారణమనే ఘటన చోటుచేసుకుంది భూకంపంతో అల్లాడుతున్న సిరియాలో. ఓ పక్క శవాల గుట్టలు. మరోపక్క అప్పుడే ఈ భూమ్మీదకు వచ్చిన ఓ శిశువు. కష్టకాలంలోనూ వెలుగు రేఖను ప్రసరించే ప్రయత్నం చేశాడేమో ఆ లయకారకుడు.. సిరియా భూకంప శిథిలాల కిందే బిడ్డను ప్రసవించింది. బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిందో తల్లి. ఓ బిడ్డ ఈ లోకంలోకి వస్తే మరో ప్రాణం అనంతవాయువుల్లో కలిసింపోయింది.
టర్కీ, సిరియాలో ఎటు చూసినా భవనాల శిథిలాలు.. శవాల దిబ్బలను తలపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎటు చూసినా భూకంపాలకు సంబంధించిన దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఎంతటి కఠినాత్ములకైనా కన్నీరు తెప్పిస్తున్నాయి.ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఓ బిడ్డ ఈ భూమ్మీదకు వచ్చింది.
సిరియా అలెప్పోలో ఓ తల్లి భూకంప శిథిలాల్లోనే బిడ్డకు జన్మినిచ్చింది. మరింత విషాదం ఏమిటంటే ప్రసవించిన వెంటనే ఆ తల్లి కన్నుమూసింది. శిథిలాల తొలగింపు క్రమంలో ఇది గమనించిన స్థానికులు.. ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకబడగానే ఉన్నట్లు తెలుస్తోంది.