Rahul Gandhi – Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఓ గిరిజనుడిపై ప్రవీణ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనపై కాంగ్రెస్ (Congress) అగ్ర నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ తీరుపై రాహుల్ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. మూత్ర విసర్జన చేసిన వ్యక్తి బీజేపీ (BJP) నేత అని తెలుస్తోంది.
‘‘ బీజేపీ పాలనలో గిరిజన సోదరులు, సోదరీమణులపై దాడులు పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీ నేత అమానుష చర్య మానవత్వానికే సిగ్గుచేటు ’’ అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. గిరిజనులు, దళితులపై బీజేపీ నిజస్వరూపం ఇదేనని విమర్శించారు.
కాగా, నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో కూల్చి వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు ప్రవీణ్ శుక్లాని పోలీసులు అరెస్టు చేశారు. నేషనల్ సెక్యూర్టీ యాక్ట్ కింద నిందితుడిపై కేసు నమోదు చేశాయని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలు ఇచ్చారు. నిందితుడిపై 294, 504 సహా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో గిరిజనుడిపై ప్రవీణ్ శుక్లా మూత్ర విసర్జన చేసిన వీడియో బాగా వైరల్ అవుతుండడం బీజేపీని ఇరకాటంలో పెడుతోంది. మధ్యప్రదేశ్ లోనే కాకుండా మరికొన్ని నెలల్లో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. బీజేపీ పాలనలో గతంలో దళితులు, గిరిజనులపై జరిగిన దాడులను ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి.