EetelaRajender slams KCR: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్లో ఇవాళ ఆయన ఐలమ్మ విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులు అర్పించి, అనంతరం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అంటే అవినీతికి మారుపేరు అని విమర్శించారు. కుటుంబ పరిపాలనకు మారుపేరుగా కూడా కేసీఆర్ మారారని ఎద్దేవా చేశారు.
ఇటువంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి నాయకత్వ వహిస్తానంటూ మాట్లాడుతున్నారని, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చెల్లని మాటలుగా మిగిలిపోతాయని ఈటల అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ డబ్బును, మద్యాన్ని నమ్ముకుని పోటీ చేసిందని ఆయన చెప్పారు. ఇతర ప్రాంతాల్లోనూ ఆ పార్టీ అదే తీరుకనబర్చుతోందని అన్నారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలు చూస్తుంటే కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానన్న చందంగా ఉందని అన్నారు. ధనిక రాష్ట్రంగా వెలుగొందని తెలంగాణను ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని ఆయన విమర్శించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించాలని ఆయన డిమాండ్ చేశారు.