presidential elections: రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకి దీటుగా బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలు ఎవరిని అభ్యర్థిగా నిలబెడతాయన్న ఉత్కంఠ నెలకొంది. విపక్ష పార్టీలు పరిశీలిస్తోన్న అభ్యర్థుల జాబితాలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధినేత ఫరూఖ్ అబ్దుల్లా కూడా ఉన్నారు. అయితే, విపక్ష పార్టీల రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి రేసు నుంచి తాను మర్యాదపూర్వకంగా తప్పుకుంటున్నట్లు ఫరూఖ్ అబ్దుల్లా శనివారం ప్రకటించారు.
Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపీ కమిటీ ఏర్పాటు
ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో పరిస్థితులు బాగోలేవని, వాటిని చక్కదిద్దడానికి తాను ప్రయత్నించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తన రాజకీయ జీవితం ఇంకా ఉందని, దేశానికి, జమ్మూకశ్మీర్కి తనవంతు సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విపక్ష పార్టీలు పరిశీలిస్తోన్న రాష్ట్రపతి ఎన్నిక అభ్యర్థుల జాబితాలో తన పేరును ప్రతిపాదించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. అలాగే, తనకు మద్దతుగా నిలిచిన నేతలు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికకు జూన్ 29న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూలై 18న ఎన్నిక జరుగుతుంది.