vice president polls: దేశంలో త్వరలో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థిగా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి మార్గరెట్ అల్వా(80) పోటీ చేస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. ఇవాళ ఢిల్లీలో విపక్ష పార్టీల నేతలు సమావేశమై తమ తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న విషయంతో పాటు, పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏయే అంశాలపై నిలదీయాలన్న అంశంపై చర్చించారు. అనంతరం శరద్ పవార్ విపక్ష పార్టీల ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించారు.
గతంలో గోవా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్గా మార్గరెట్ అల్వా పనిచేశారు. అంతకుముందు కేంద్ర మంత్రిగానూ కొనసాగారు. కర్ణాటకలోని మంగళూరులో 1942లో ఆమె జన్మించారు. కెరీర్ ప్రారంభంలో న్యాయవాది వృత్తిలో ఉన్నారు. 1969 నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాగా, ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ పేరును నిన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజే విపక్ష పార్టీలు తమ అభ్యర్థి పేరును ప్రకటించడం గమనార్హం. కాగా, ఆగస్టు 10తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం ముగియనుంది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ కూడా కెరీర్ మొదట్లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.
Cloudburst: అందుకే సీఎం కేసీఆర్ ‘క్లౌడ్ బరస్ట్’ అన్నారు: ఉత్తమ్ కుమార్రెడ్డి