Air India Express : సిబ్బంది యాక్షన్.. ఎయిరిండియా రియాక్షన్.. ఏకంగా 30మంది తొలగింపు..!

విధుల్లో చేరకపోతే మరింత మందిని తొలగించేందుకు కూడా సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలవుల్లో వెళ్లిన సిబ్బందితో సంస్థ ప్రతినిధులు సమావేశమై చర్చించే అవకాశం ఉంది.

Air India Express : ఉద్యోగులకు షాక్ ఇచ్చింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్‌. మూకుమ్మడి సెలవులు పెట్టిన సిబ్బందిపై యాక్షన్‌కు దిగింది. దాదాపు 3వందల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నట్లుండి సెలవులు పెట్టడంతో.. దాదాపు 80 ఎయిర్‌ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్లు  రద్దయ్యాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది యజమాన్యం. ఏకంగా 30మంది ఉద్యోగులను తొలగించింది. మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది.

వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే అందరినీ తొలగిస్తామని హెచ్చరించింది. 3వందల మంది ఉద్యోగుల మూకుమ్మడి సెలవులతో విమానాలు రద్దయిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకుంది ఎయిర్‌ఇండియా. విధుల్లో చేరకపోతే మరింత మందిని తొలగించేందుకు కూడా సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలవుల్లో వెళ్లిన సిబ్బందితో సంస్థ ప్రతినిధులు సమావేశమై చర్చించే అవకాశం ఉంది. క్యాబిన్ క్రూ సిబ్బంది సెలవుల్లో వెళ్లడంతో బుధవారం 80, గురువారం మరో 85 సర్వీసులను రద్దు చేశారు.

ముందస్తు ప్రణాళికలో భాగంగానే మూకుమ్మడి సెలవుపై వెళ్లారని.. 30 మందికి పంపిన తొలగింపు లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఎయిర్‌ ఇండియా సంస్థ. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయని..సంస్థ ప్రతిష్ఠకూ నష్టం జరిగిందని తెలిపింది. క్యాబిన్ క్రూ సిబ్బంది వ్యవహరించిన తీరు సంస్థ నిబంధనలకు విరుద్ధమని.. అందువల్లే చర్యలు తీసుకోవాల్సి వస్తోందని క్లారిటీ ఇచ్చింది ఎయిర్ ఇండియా యజమాన్యం.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో..AIX కనెక్ట్‌ విలీన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి క్యాబిన్‌ క్రూ సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులతో కంపెనీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని 3వందల మంది క్యాబిన్‌ సిబ్బందితో ఏర్పడిన యూనియన్ ఆరోపించింది. కొత్త ఒప్పందంలో భాగంగా తక్కువ వేతనం ఇవ్వటంతో పాటు సిబ్బంది అందరినీ సమానంగా చూడడం లేదని వివరించింది ఎంప్లాయిస్ యూనియన్.

Read Also : Air India Express : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో సంక్షోభం.. 86 సర్వీసులు రద్దు, ప్రయాణికుల అవస్థలు 

ట్రెండింగ్ వార్తలు