Sabarimala Ayyappa Temple : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఈరోజు తెరుస్తారు. తులా మాసం పూజలకోసం శనివారం అక్టోబర్ 16వతేదీ సాయంత్రం 5 గంటలకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్టు ఆలయాన్ని తెరవనుంది. రేపట్నుంచి ఈ నెల 21వ తేదీ వరకు అయ్యప్ప ఆలయంలోకి భక్తులకు అనుమతిస్తారు. ఈరోజు ప్రధాన పూజారి వీకే జయరాజ్, మహేశ్ మోహనారు సమక్షంలో ఆలయాన్ని తెరిచి దీపాలు వెలిగిస్తారు.
ఈరోజు పూజలు ఏమీ ఉండవని దేవస్ధానం తెలిపింది. రేపటినుంచి నెయ్యాభిషేకం, ఉదయస్థానపూజ, కలశాభిషేకం, పడిపూజ, పుష్పాభిషేకం వంటి పూజలు నిర్వహించనున్నారు. రేపు డ్రా పద్ధతిలో శబరిమల ఆలయ ప్రధాన పూజారిని ఎంపిక చేస్తారు.
21న శబరిమల ఆలయాన్ని ట్రావెన్ కోర్ బోర్డు మూసివేయనుంది. మళ్లీ నవంబర్ 2వ తేదీన ఆలయాన్ని తెరవనున్నారు. ఆ మరుసటి రోజే టెంపుల్ను మూసేసి, మండలం – మకరవిలాక్కు పండుగ నేపథ్యంలో నవంబర్ 15న ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు.
శబరిమల వచ్చే భక్తులకు మార్గదర్శకాలు
అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను వర్చువల్ బుకింగ్ ద్వారానే అనుమతిస్తారు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయిన సర్టిఫికెట్ లేదా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలి.