చక్కనమ్మ చిక్కినా అందమే..జుట్టున్నవాడు ఏ కొప్పైనా పెట్టుకుంటాడు. అలాగే డబ్బులున్నవాడు ఏ కాలంలోఅయినా ఆఖరికి కరోనా కాలంలో అయినా తన దర్జాలో ఏమాత్రం తగ్గేది లేదంటాడు. మాస్కుల్లో ఈ మాస్కులు వేరయా అన్నట్లుగా ఏకంగా వజ్రాలతో తయారు చేసిన మాస్కులు పెట్టుకుని ఇదీ మారేంజ్..అంటున్నారు బడాబాబులు.
మహారాష్ట్రకు చెందిన శంకర్ కురాడే అనే కుర్రాడు 3 లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారు మాస్క్ పెట్టుకుని అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు అన్నట్లుగా..బోడి బంగారం మాస్క్ ఏంటీ..అంటూ ఏకంగా కొందరు వ్యాపారులు ఏకంగా వజ్రాల మాస్కులు మార్కెట్లోకి తీసుకొచ్చాడు.
గుజరాత్లోని సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి కుశాల్ భాయ్..దీపక్ చోక్సీలు వజ్రాల మాస్కులను తయారు చేస్తున్నారు. వజ్రాల క్వాలిటీ..వజ్రాల సంఖ్య బట్టి ఒక్కో మాస్క్ ధర లక్షన్న నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు పలుకుతోంది.
ధనవంతుల వర్గాల్లో ఈ ‘వజ్రాల మాస్కులకు బాగా డిమాండ్ వచ్చింది. అందరూ పెట్టుకునే మాస్కులు మనం కూడా పెట్టుకుంటే వారికీ మనకూ తేడా ఏముంటుంది? ఫంక్షన్లకు వజ్రాల మాస్క్ పెట్టుకుంటే అందరి చూపూ తమమీదనే ఉండాలా చేసుకోవాలనుకునేవారు ఈ వజ్రాల మాస్కుల్ని కొనుకుంటున్నారట.
అలా..ఓ పెళ్లి కొడుకు తన దర్పం చూపించుకోవటానికి తన కాబోయే భార్యకు వజ్రాల మాస్కులు కావాలంటూ ఆర్డర్ ఇచ్చాడని మరో వ్యాపారి దీపక్ చోక్సీ చెప్పారు. వాటిని తయారు చేసి ఇవ్వటంతో వజ్రాల మాస్కులకు ధనవంతుల నుంచి మంచి డిమాండ్ వచ్చింది. దీంతో అమెరికన్ డైమెండ్స్, గోల్డ్ కలిపి వీటిని తయారు చేస్తున్నాం అని తెలిపారు దీపక్ చోక్సీ.