Cheetahs New Names: షియోపూర్లోని కునో నేషనల్ పార్క్లో ఉంచిన నమీబియాకు చెందిన ఎనిమిది చిరుతలకు త్వరలో కొత్త పేర్లను పెట్టనున్నారు. అయితే, ఈ చిరుతలకు ఏ పేరు అయితే బాగుంటుందో సూచించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ఆన్లైన్లో దేశవ్యాప్తంగా ప్రజలు స్పందిస్తూ.. 11 వేలకుపైగా పేర్లను సూచించారు. అదే సమయంలో చిరుతపులి ప్రాజెక్ట్ కోసం 18వేలకు పైగా పేర్లను సూచించారు.
నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు. అయితే, గతనెల25న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. చిరుతల ప్రాజెక్టుతో పాటు అక్కడున్న ఎనిమిది చిరుతలకు పేర్లు పెట్డానికి ఒక పోటీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. MyGov ప్లాట్ఫారమ్లో ఒక పోటీ నిర్వహించబడుతుంది.. దీనికి సంబంధించి కొన్ని విషయాలను పంచుకోవాలని నేను ప్రజలను కోరుతున్నాను అని చెప్పారు. మన దేశానికి వచ్చిన చిరుతలకు ఏ పేరు బాగుంటుందో సూచించాలని అన్నారు. ఈ పోటీలో పాల్గొనే వారు పేర్ల విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలను ప్రధాని మోదీ సూచించారు. పేర్లు సంప్రదాయంగా, భారతీయ సంస్కృతికి, వారసత్వానికి అనుగుణంగా ఉండాలని సూచించారు.
సెప్టెంబర్ 26న ఈ ప్రక్రియ ప్రారంభమై అక్టోబర్ 31 వరకు కొనసాగింది. పోర్టల్ లో నమోదు చేయబడిన డేటా ప్రకారం.. దేశ వ్యాప్తంగా 11,565 మంది తమకు తోచిన పేర్లను సూచించారు. అదే సమయంలో చిరుత ప్రాజెక్టు కోసం 18వేల 221 మంది పేర్లను సూచించారు. MyGov పోర్టల్లో చిరుతలకు వివిధ సంప్రదాయ పేర్లను సూచించారు. ఇందులో మగ చిరుతలకు శివ, గణేశ, విష్ణు, బ్రహ్మ, ఆడ చిరుతలకు పార్వతి, లక్ష్మి, దుర్గ, గౌరీ, దేవి అని పేర్లు పెట్టాలని సూచించాడు.
అదే సమయంలో కొందరు వ్యక్తులు మగ చిరుతలకు.. కళ్యాణ్, అమృత్, నంబి, సింధు, రవీంద్ర, శివ, ఆరంభ్, ఆడ చిరుతలకు కావేరీ, మను, వింధ్య, నైటింగేల్, కాశ్మీర, జయంతి, వైశాఖి, కాళీ అని చెప్పారు. ఆన్లైన్ పోటీలో చిరుత ప్రాజెక్ట్ కోసం సూచించబడిన పేర్లలో ప్రాజెక్ట్ అవినాష్, మిషన్ రిటర్నింగ్ చీతా ఇన్ ఇండియా, నేషనల్ చిరుత పునరుద్ధరణ ప్రాజెక్ట్ వంటివి 18వేల పేర్ల వరకు సూచించారు.