Patnam Mahender Reddy: తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, గవర్నర్తో విబేధాల కారణంగా చాలా కాలంగా గవర్నర్ కార్యాలయంతో దూరంగా ఉంటూ వస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలా కాలం తర్వాత రాజ్ భవన్కు వచ్చారు. కాగా, మహేందర్ రెడ్డి చేత మంత్రిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు, సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరికొద్ది రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టడం గమనార్హం. కాగా, పట్నం మహేందర్ రెడ్డి గతంలో కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 2014 నుంచి 2018 వరకు ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఆయన మీద కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం 2019లో శాసన మండలి ద్వారా అసెంబ్లీలో అడుగుపెట్టారు.