Fire Broke Out In Secunderabad: సికింద్రాబాద్లోని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనం కాగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో సికింద్రాబాద్ ప్రాంతంలో భారీ శబ్దాలు వచ్చాయి. చూస్తుండగానే దట్టమైన పొగ, మంటలు చెలరేగిపోయాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే కొందరు అగ్నికి ఆహుతయ్యారు.
సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం సమీపంలో రూబీ ఎలక్ట్రిక్ షోరూం కొనసాగుతోంది. అదే భవనం సెల్లార్లో ఆ షోరూం వాహనాల గోదాము కొనసాగుతోంది. కాగా, సోమవారం రాత్రి 9 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఈ స్కూటర్ పేలింది. ఆ మంటలు ఇతర స్కూటర్లకు వ్యాపించడంతో ఒక్కొక్కటిగా పేలుతూ పోయాయి. రూబీ ఎలక్ట్రిక్ షోరూం పైన రూబీ హోటల్ కొనసాగుతోంది. ఈ హోటల్ వరకు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్లో 25 మంది బస చేస్తున్నారు.
ఒక్కసారిగా మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో హోటల్లో ఉన్నవారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే కొందరు సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణ భయంతో పై నుంచి కిందకు దూకారు. కాగా, ఒక మహిళ సహా మరో ఆరుగురు కిందకు దూకలేక మెట్ల వైపు పరుగులు తీశారు. ఆ ప్రయత్నంలో వారికి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించినట్లు తెలిసింది.
రూబీ ఎలక్ట్రిక్ షూరం, హోటల్ ఉన్న భవనంలో మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. ఈ భవనం లోపలికి వెళ్లడానికి, బయటికి వెళ్లడానికి ఒకే దారి ఉంది. అందుకే ప్రమాదంలో ఎక్కువ మంది మంటలకు గురి కావాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ఈ కారణం చేతనే మంటల్ని సత్వరంగా ఆపేందుకు అగ్నిమాపక సిబ్బందికి కూడా ఇబ్బంది ఎదురైంది. షోరూం గోదాములో ఈ స్కూటర్లను పార్క్ చేస్తారు. ఒక భాగంలో ఈ-స్కూటర్ల బ్యాటరీలను చార్జింగ్ చేస్తుంటారు. అక్కడే షార్ట్ సర్క్యూట్ జరిగి.. ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Gujarat Elections: హైడ్రామా నడుమ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేసిన కేజ్రీవాల్