Sri lanka crisis : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. నిత్యావసరాల కొరత, పెరిగిన ధరలు, విద్యుత్ కోతలతో అక్కడి ప్రజలు రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. ఇందులో భాగంగా శనివారం ఆదేశ రాజధాని కొలంబోలోని ప్రధాన బీచ్ ఫ్రంట్ లోని గాల్ ఫేస్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమ్మిగూడి నిరసన తెలిపారు. ప్రధాని మహిందా రాజపక్సే, అధ్యక్షుడు గొటబయ రాజపక్సేలకు వ్యతిరేకంగా నినదించారు. మాకు మంచి భవిష్యత్తు కావాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదంటూ విమర్శించారు.
మరోవైపు ప్రజల ఆందోళనలకు నిరసనగా పలువురు లంక క్రికెటర్లు మద్దతు తెలిపారు. రోడ్డుపైకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. శ్రీలంకకు ప్రపంచ కప్ అందించిన అర్జున రణతుంగతో పాటు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యలు ఆందోళనల్లో పాల్గొన్నారు. జయసూర్య బారికేడ్లు ఎక్కిమరీ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ.. ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానికి సూచించారు. అంతేకాక దేశ అధ్యక్షుడి తీరుకు నిరసనగా ఇతర క్రికెటర్లు వీధుల్లోకి వచ్చి ప్రజలకు మద్దతుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మాజీ క్రికెటర్, ఐసీసీ రెఫరీ రోషన్ మహానామా, మాజీ కెప్టెన్లు మహేళ జయవర్ధనే, కుమార సంగర్కర వంటివారు ఇప్పటికే అధ్యక్షుడి రాజీనామా కోసం జరుగుతున్న ఆందోళనలకు మద్దతు ప్రకటించారు.
#SriLankaEconomicCrisis | Mass demonstrators agitate at Galle Face in Colombo against the government. pic.twitter.com/HnWImrzgkT
— ANI (@ANI) April 16, 2022