Telangana formation day: తెలంగాణ ప్రజలు నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోన్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ట్విటర్లో తెలుగులో పోస్టులు చేసి శుభాకాంక్షలు చెప్పారు.
”రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణ రాష్ట్ర సంస్కృతి. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.
అలాగే, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. తెలంగాణ ఉద్యమంలో యువత పాత్రను కొనియాడారు. ”దేశ ప్రగతి కోసం కట్టుబడిన యువత కృషితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని కోరుతూ.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు” అని అమిత్ షా ట్విటర్లో పేర్కొన్నారు.