Maharashtra: మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ లేఖ రాశారు. రేపు బలపరీక్ష జరుగుతుందని చెప్పారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మైనారిటీ ఉందని తనకు బీజేపీతో పాటు ఇతరుల నుంచి లేఖలు వచ్చాయని తెలిపారు. శివసేన పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు తాము మహా వికాస్ అఘాడీ నుంచి వైదొలుగుతున్నామని స్పష్టమైన సూచనలు చేశారని ఆయన అన్నారు.
అయినప్పటికీ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై గెలుపొందడానికి ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నాలు చేయడం సరికాదని, ఇది అప్రజాస్వామికమని ఆయన చెప్పారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందని, బలపరీక్షలో గెలవలేదని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. బలపరీక్ష లైవ్లో ప్రసారమవుతుందని, ఈ ప్రక్రియ మొత్తం కెమెరాలో రికార్డు అవుతుందని ఆయన చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా శాసన సభ్యులు లేచి నిలబడాలని అడుగుతారని తెలిపారు. ఆ తర్వాత వారి సంఖ్యను లెక్కిస్తారని చెప్పారు.